స్మిత్ తెలివైనోడు.. రూల్స్లోని లూప్ హోల్ను వాడుకున్నాడు: పార్థీవ్ పటేల్

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా తాత్కలిక సారథి స్టీవ్ స్మిత్ చాలా తెలివైనోడని టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ అన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్తో ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్ట్లో స్మిత్ తన కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడని చెప్పాడు. క్రికెట్ రూల్స్లోని లూప్ హోల్స్ను కూడా అతను వాడుకున్నాడని వివరించాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 9 వికెట్ల తేడాతో చిత్తయిన విషయం తెలిసిందే. ఈ పరాజయం నేపథ్యంలో పార్టీవ్ పటేల్ ట్విటర్ వేదికగా 'ఫ్యాన్స్ ఆస్క్' పేరిట అభిమానులతో చిట్ చాట్ చేశాడు.

స్మిత్ చేసింది కరెక్టేనా..?
ఈ సందర్భంగా స్టీవ్ స్మిత్ ఉపయోగించిన ట్రిక్ను ఓ అభిమాని పార్థీవ్ ముందు ఉంచాడు. 'బ్యాటర్ క్రీజులో ఉన్నా స్టంపింగ్ చేసినట్లు బెయిల్స్ను పడగొట్టి.. ఇటు క్యాచ్ రివ్యూను కూడా ఆసీస్ దక్కించుకుంది గమనించారా? క్రికెట్లో ఇది సరైన పద్ధతేనా..? డీఆర్ఎస్లను తమ వద్ద ఉంచుకోవడానికి ఇలా చేశారని అనిపించడం లేదా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి?'అని ప్రశ్నించాడు. దీనికి పార్థివ్ పటేల్ వివరణాత్మక సమాధానం ఇచ్చాడు.

లూప్ హోల్ వాడుకున్నాడు..
'క్రికెట్ నిబంధనల్లో అక్కడ లొసుగు(లూప్ హోల్) ఉంది. ఫీల్డింగ్ టీమ్ ఎప్పుడైనా స్టంపింగ్ కోసం అప్పీలు చేస్తే.. ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరితే నిబంధన ప్రకారం పరిశీలిస్తారు. బంతి బ్యాట్కు తాకిందా? క్రీజులో కాలు పెట్టాడా? అని పూర్తి చెక్ చేస్తారు. ఈ లూప్ హోల్పై స్మిత్కు పూర్తి అవగాహన ఉంది. దానిని అతను తెలివిగా వినియోగించుకున్నాడు. ఇలాంటి సమస్యకు రెండు పరిష్కారాలు ఉన్నాయి.

థర్డ్ అంపైర్ అలా చేస్తే..
అందులో ఒకటి, ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయంపై నమ్మకంతో ఉన్నప్పుడు థర్డ్ అంపైర్ సమీక్ష కోరకూడదు. అలాకాకుండా, ఫీల్డింగ్ జట్టు స్టంపింగ్ కోసం అప్పీలు చేస్తే.. కేవలం దానిని మాత్రమే థర్డ్ అంపైర్ పరిశీలిస్తే సరిపోతుంది. ఒకవేళ, క్యాచ్ ఔట్ కూడా సమీక్షించాలంటే.. తప్పనిసరిగా డీఆర్ఎస్ తీసుకోవాలనే రూల్ పెట్టాలి. క్యాచ్, ఎల్బీ.. ఇలా దేని కోసం అప్పీలు చేసినా.. వాటి వరకే చెక్ చేస్తే ఇలాంటి సమస్యలు రిపీట్ అవ్వవు'అని పార్థివ్ పటేల్ చెప్పుకొచ్చాడు.

ఆసీస్ సునాయసంగా..
76 పరుగుల లక్ష్యంతో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 18.5 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 78 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(0) సిల్వర్ డక్గా వెనుదిరిగినా.. ట్రావిస్ హెడ్(53 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 49 నాటౌట్), మార్నస్ లబుషేన్(58 బంతుల్లో 6 ఫోర్లతో 28) అటాకింగ్ గేమ్తో విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. భారత బౌలర్లలో అశ్విన్ ఒక్కడే ఒక వికెట్ తీసాడు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన టీమిండియా 109 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 197 పరుగులు చేసి 88 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్లోనూ విఫలమైన భారత్ 163 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్ మాథ్యూ కుహ్నేమన్ ఐదు వికెట్లతో భారత్ను దెబ్బతీస్తే.. రెండో ఇన్నింగ్స్లో నాథన్ లయన్ 8 వికెట్లతో పతనాన్ని శాసించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications