ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మపై టీమిండియా మాజీ క్రికెటర్ పార్దీవ్ పటేల్ ప్రశంసల జల్లు కురిపించాడు. రోహిత్ శర్మ అసాధారణమైన కెప్టెన్ అని, ఆటగాళ్ల ప్రతిభను బయటకు తీయడంలో అతని సాటిలేరని కొనియాడాడు. రోహిత్ శర్మ సారథ్యం కారణంగానే హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలు స్టార్ క్రికెటర్లుగా ఎదిగారని చెప్పాడు.
ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్కాస్టర్ జియో సినిమా ప్రీ టోర్నీ షోలో మాట్లాడిన పార్దీవ్ పటేల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. పేలవ ఫామ్తో ఇబ్బంది పడిన హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు రోహిత్ శర్మ అండగా నిలిచాడని గుర్తు చేసుకున్నాడు. తుది జట్టు నుంచి తప్పించాలని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయించినా.. రోహిత్ శర్మ వారిని కొనసాగించాడని తెలిపాడు.

'2015లో ఐపీఎల్లోకి అడుగుపెట్టిన జస్ప్రీత్ బుమ్రా.. తన ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయాడు. దాంతో సీజన్ మధ్యలోనే టీమ్మేనేజ్మెంట్ బుమ్రాను వదిలేయాలనుకుంది. కానీ రోహిత్ శర్మ అతనికి అండగా నిలిచాడు.
అతని ప్రతిభపై నమ్మకం ఉంచిన రోహిత్.. జట్టులో కొనసాగించాలని పట్టుబట్టాడు. తర్వాతి సీజన్లో అతను తన సత్తా ఏంటో చూపించాడు. ఐపీఎల్ ప్రదర్శనతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి వరల్డ్ క్లాస్ పేసర్గా ఎదిగాడు.
హార్దిక్ పాండ్యాకు కూడా రోహిత్ అండగా నిలిచాడు. 2016 సీజన్లో హార్దిక్ పాండ్యా పేలవ ఫామ్తో సతమతమయ్యాడు. సత్తా చాటని అనామక ఆటగాళ్లను, అది కూడా రూ. 10 లక్షల బేస్ ప్రైజ్ కలిగిన ప్లేయర్ను ఏ ఫ్రాంచైజీ వదిలేస్తోంది. కానీ రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా టాలెంట్ను గుర్తించి అండగా నిలిచాడు. దాంతో హార్దిక్ పాండ్యా స్టార్ ఆల్రౌండర్గా ఎదిగాడు.'అని పార్దీవ్ పటేల్ చెప్పుకొచ్చాడు.
రోహిత్ శర్మ అండతో ఎదిగిన హార్దిక్ పాండ్యా.. ఇప్పుడు అతని కెప్టెన్సీకే ఎసరు పెట్టాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్ 2024 సీజన్ వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్కు చెందిన హార్దిక్ పాండ్యాను క్యాష్ ట్రేడింగ్ డీల్ ద్వారా జట్టులోకి తెచ్చుకున్న ముంబై ఇండియన్స్.. అతనికి జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించింది. జట్టు భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని వివరణ ఇచ్చింది.