టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై మాజీ వికెట్ కీపర్ పార్దీవ్ పటేల్ ప్రశంసల జల్లు కురిపించాడు. ప్యాట్ కమిన్స్, బెన్ స్టోక్స్, షకీబ్ అల్ హసన్ కంటే జడేజా అత్యుత్తమ ఆల్రౌండర్ అని కొనియాడాడు. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో జడేజా భారత విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. బ్యాటింగ్లో సెంచరీ బాదిన జడేజా.. బౌలింగ్లో రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించాడు. ఈ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
తాజాగా జడేజా ప్రదర్శన గురించి మాట్లాడిన పార్దీవ్ పటేల్.. తన టెస్ట్ కెరీర్ ముగిసే సమయానికి 400 వికెట్లు తీయడంతో పాటు 4000 పరుగులు చేస్తాడని జోస్యం చెప్పాడు. 'రవీంద్ర జడేజా భారత దిగ్గజ ఆల్రౌండర్ అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇప్పటికే అతను 4 వేల పరుగుల మైలురాయికి సమీపించడంతో పాటు 335 వికెట్లు పడగొట్టాడు. అతని కెరీర్ ముగిసే సమయానికి టెస్ట్ల్లో 4 వేల పరుగులు చేయడంతో పాటు 400 వికెట్లు పడగొడుతాడు. గ్లోబర్ స్టేజ్లో అరుదైన ఘనతను జడేజా అందుకుంటాడు.

ప్రస్తుతం జడేజా వరల్డ్ నెంబర్ వన్ ఆల్రౌండర్. ఈ విషయంపై మరో చర్చే అనవసరం. బెన్ స్టోక్స్, ప్యాట్ కమిన్స్, షకీబ్ అల్ హసన్ కంటే ఆల్రౌండర్గా జడేజా చాలా ముందున్నాడు. బ్యాటర్గా, బౌలర్గా అతని అసాధారణ నిలకడ..ప్రత్యేకంగా నిలబెట్టింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతని నిలకడైన ప్రదర్శన ప్రస్తుతం వరల్డ్ బెస్ట్ ఆల్రౌండర్గా నిలబెట్టింది.'అని పార్దీవ్ పటేల్ జియో హాట్స్టార్తో అన్నాడు.
ఐసీసీ టెస్ట్ ఆల్రౌండర్లలో జడేజా 405 రేటింగ్ పాయింట్స్తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 36 ఏళ్ల జడేజా ఇప్పటికే టెస్ట్ల్లో 38.73 సగటుతో 3990 పరుగులు చేశాడు. ఇందులో 6 శతకాలతో పాటు 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్లో 25.07 సగటుతో 334 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 15 సార్లు ఐదు వికెట్ల ఘనత అందుకోవడంతో పాటు 3 సార్లు పది వికెట్ల ఘనతను అందుకున్నాడు.
ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఐదు టెస్ట్ల సిరీస్లో జడేజా 516 పరుగులతో నాలుగో హయ్యెస్ట్ రన్ స్కోరర్గా నిలిచాడు. 10 ఇన్నింగ్స్ల్లో 86 సగటుతో ఈ పరుగులు చేశాడు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలతో పాటు ఓ శతకం ఉంది. ఈ సిరీస్లో ఏడు వికెట్లు కూడా పడగొట్టాడు. వెస్టిండీస్తో శుక్రవారం ప్రారంభమయ్యే రెండో టెస్ట్లో జడేజా నాలుగు వేల పరుగుల మైలురాయి అందుకునే ఛాన్స్ ఉంది.