
న్యూఢిల్లీ: టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ పార్థివ్ పటేల్ అంతర్జాతీయ క్రికెట్తో పాటు అన్ని ఫార్మాట్ల ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. బుధవారం ట్విటర్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్తో 35 ఏళ్ల పార్థీవ్ ఈ నిర్ణయాన్ని వెల్లడించాడు. ఈ పోస్ట్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)తో పాటు ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. దాదా సారథ్యంలోనే పార్థీవ్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు.
భారత్ తరఫున 25 టెస్ట్లు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడిన పార్థీవ్.. మహేంద్ర సింగ్ ధోనీ భారత జట్టులోకి రానంతవరకు కీలక ఆటగాడిగా జట్టులో కొనసాగాడు. వన్డేల్లో 4 హాఫ్ సెంచరీలతో 736 రన్స్ చేసిన పార్థీవ్.. టెస్ట్ల్లో 6 హాఫ్ సెంచరీలతో 934 పరుగులు చేశాడు.
2002 ఇంగ్లండ్ పర్యటనలోని టెస్ట్ మ్యాచ్తో 17 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన పార్థివ్.. ఈ ఘనతను అందుకున్న అత్యంత పిన్న వికెట్ కీపర్గా గుర్తింపుపొందాడు. సచిన్ టెండూల్కర్ తరహాలోనే పాల బగ్గల వయసులో భారత జట్టులోకి వచ్చిన పార్థీవ్ను చూసి అతను మరో మాస్టర్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ ధోనీ రాకతో జట్టులో చోటు కోల్పోయిన పార్థీవ్.. మళ్లీ 2016లో కమ్బ్యాక్ చేశాడు. 2018 సౌతాఫ్రికా పర్యటనలో జోహన్నస్బర్గ్ వేదికగా జరిగిన టెస్టే పార్థీవ్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్.
ఇక దేశవాళీ క్రికెట్లో గుజరాత్ తరఫున తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా 2016-17 సీజన్లో జట్టును అద్భుతంగా నడిపించి విజేతగా నిలిపాడు. ఐపీఎల్లో మొత్త 6 జట్లకు ఆడిన పార్ధీవ్ ఎక్కువ కాలం ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించాడు. అయితే యవ ఆటగాడు దేవదత్ పడిక్కల్ కారణంగా పార్ధీవ్కు ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఓవరాల్గా 139 ఐపీఎల్ మ్యాచ్ల్లో ఈ సీనియర్ వికెట్ కీపర్ 2848 రన్స్ చేశాడు. 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ కలిగిన పార్థీవ్కు మాజీ, ప్రస్తుత క్రికెటర్లతో పాటు అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.