ఐపీఎల్ 2025 సీజన్కు రంగం సిద్దమైంది. మరికొద్ది క్షణాల్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మధ్య జరిగే తొలి మ్యాచ్తో ఈ క్యాష్ రిచ్ లీగ్కు తెరలేవనుంది. నాలుగో టైటిల్ గెలవడమే లక్ష్యంగా కేకేఆర్.. టైటిల్ నిరీక్షణకు తెరదించాలనే సంకల్పంతో ఆర్సీబీ బరిలోకి దిగుతున్నాయి.
ఇరు జట్లు నయా సారథులతో బరిలోకి దిగడం విశేషం. ఎంతో అనుభవం కలిగిన వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానే సారథ్యంలో కేకేఆర్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మరోవైపు కనీసం టీమిండియా తరఫున ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడని యువ ప్లేయర్ రజత్ పటీదార్ సారథ్యంలో ఆర్సీబీ బరిలోకి దిగుతోంది. బలబలాల పరంగా ఇరు జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నా.. ఈ మ్యాచ్లో కేకేఆర్ హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. సొంతగడ్డపై ఈ మ్యాచ్ జరగనుండటంతో పాటు గత నాలుగు మ్యాచ్ల్లో ఆర్సీబీని కేకేఆర్ చిత్తు చేసింది.

అంతేకాకుండా కేకేఆర్లో సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, క్వింటన్ డికాక్, ఆండ్రీ రస్సెల్, రమణ్దీప్ సింగ్లతో డేంజరస్ బ్యాటింగ్ లైనప్ ఉంది. బౌలింగ్లో క్షణాల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చే మిస్టరీ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తీ, సునీల్ నరైన్లు ఉన్నారు. అన్రిచ్ నోకియా, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్, చేతన్ సకారియాలతో పేస్ విభాగం కూడా బలంగానే ఉంది.
విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, దేవదత్ పడిక్కల్, జితేశ్ శర్మ, లియామ్ లివింగ్ స్టోన్, టీమ్ డేవిడ్, జాకబ్ బెత్వెల్తో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉండగా.. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్ వుడ్, యశ్ దయాలతో బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. స్పెషలిస్ట్ స్పిన్నర్లు లేకపోవడం ఆర్సీబీకి లోటుగా మారింది. ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా, లివింగ్ స్టోన్తో పాటు సుయాశ్ శర్మలు మాత్రమే ఆర్సీబీలో స్పిన్ ఆప్షన్స్గా ఉన్నారు.
ఇరు జట్ల ముఖాముఖి పోరులోనూ కోల్కతాదే పై చేయిగా ఉంది. ఇప్పటి వరకు ఇరు జట్లు 34 మ్యాచ్లు ఆడగా.. ఆర్సీబీ 14 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. కేకేఆర్ 20 విజయాలు నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్లో కేకేఆర్ సునాయస విజయం అందుకుంటుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కానీ చిలుక జోస్యం మాత్రం ఇందుకు భిన్నంగా ఆర్సీబీ విజయం సాధిస్తుందని చెప్పింది. దాంతో ఈ జోస్యంపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.