ఒలింపిక్స్లో మూడో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు పోరాటం ముగిసింది. రియో ఒలింపిక్స్ 2016లో రజతం, టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్యం గెలిచిన సింధు.. పారిస్ ఒలింపిక్స్ 2024లో మాత్రం ప్రీక్వార్టర్స్కే పరిమితమై ఉట్టి చేతులతో ఇంటిదారి పట్టింది.
గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్లో సింధు 19-21, 14-21 తేడాతో చైనా షట్లర్ హే బింగ్జావ్ చేతిలో ఓటమిపాలైంది. వరుసగా రెండు గేమ్స్లో ఓడి టోర్నీ నుంచి తప్పుకుంది.

ఈ మ్యాచ్లో పీవీ సింధు అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. తొలి గేమ్లో ఇద్దరూ షట్లర్లు హోరాహోరీగా తలపడ్డారు. క్రాస్ కోర్ట్ షాట్స్తో సింధు చెలరేగగా.. స్మాష్లతో చైనా ప్లేయర్ సత్తా చాటింది. చివరకు చైనా ప్లేయర్ పై చేయి సాధించి తొలి గేమ్ను దక్కించుకుంది. రెండో గేమ్ ఆరంభం నుంచే దూకుడు కనబర్చిన బింగ్జావ్ వరుస పాయింట్స్తో సింధుపై ఒత్తిడిని పెంచింది.
భారత షట్లర్ అనసవర తప్పిదాలను క్యాష్ చేసుకున్న చైనా ప్లేయర్ 16-8తో ఆధిక్యం సాధించింది. మధ్యలో సింధు పుంజుకొని పాయింట్స్ సాధించినా.. చైనా ప్లేయర్ పట్టు వదల్లేదు. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకొని రెండో గేమ్తో పాటు మ్యాచ్ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది.
భారత బ్యాడ్మింటన్ విభాగంలో లక్ష్యసేన్ మినహా అంతా ఇంటిదారి పట్టారు. భారీ అంచనాలతో పారిస్ ఒలింపిక్స్ 2024 బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి-చిరాగ్ శెట్టిలు క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగారు. గురువారం జరిగిన మ్యాచ్లో రాంకీ రెడ్డి-చిరాగ్ శెట్టి 21-13, 14-21, 16-21 తేడాతో ఆరోన్-సో వూయి(మలేషియా) చేతిలో ఓటమిపాలయ్యారు.
పురుషుల సింగిల్స్లో భారత షట్లర్ లక్ష్యసేన క్వార్టర్ ఫైనల్ చేరాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్లో లక్ష్యసేన్ 21-12, 21-6 తేడాతో భారత్కే చెందిన హెచ్ ఎస్ ప్రణయ్ను ఓడించాడు. పతకాలు తెస్తారని భావించిన సింధు, సాత్విక్-చిరాగ్, నిఖత్ జరీన్లు అనూహ్య ఓటములతో ఇంటిదారి పట్టడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇప్పటి వరకు భారత్కు మూడు కాంస్య పతకాలు రాగా.. ఈ మూడు షూటింగ్లోనే లభించాయి.