పారిస్ ఒలింపిక్స్ 2024లో సంచలన ఫలితం నమోదైంది. సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ అసాధారణ ప్రదర్శనతో మరో దిగ్గజ ప్లేయర్, స్పెయిన్ స్టార్ రఫెల్ నాదల్పై విజయం సాధించాడు. సోమవారం జరిగిన పురుషుల టెన్నిస్ సింగిల్స్ రెండో రౌండ్ పోరులో ఈ ఇద్దరు దిగ్గజాలు తలపడ్డారు. ఈ మ్యాచ్లో టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ 6-1, 6-4 తేడాతో రఫెల్ నాదల్ను మట్టికరిపించాడు.
జకోవిచ్ ధాటికి నాదల్ తేలిపోయాడు. వరుస సెట్లలో ఓడి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. తొలి సెట్లో కనీస పోటీ ఇవ్వలేకపోయిన నాదల్.. రెండో సెట్లో మాత్రం కాస్త ప్రతిఘటించాడు. నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ పోరులో ఈ ఇద్దరు దిగ్గజాలు 4-4తో సమంగా నిలిచారు. కానీ సెర్బియా స్టార్ ఏ మాత్రం తడబడకుండా ఆధిపత్యం చెలాయించి సెట్తో పాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు.

ఈ గెలుపుతో జకోవిచ్ టోర్నీలో ముందడుగు వేసాడు. మూడో రౌండ్కు అర్హత సాధించాడు. ఈ ఇద్దరూ దిగ్గజాలు తలపడటం ఇది 60వ సారి కాగా ఈ పారిస్ ఒలింపిక్స్ పోరే ఈ ఇద్దరి మధ్య చివరిగా నిలిచిపోనుంది.
రఫెల్ నాదల్ తన కెరీర్లో 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు గెలిచాడు. కెరీర్ చరమాంకంలో ఉన్న అతను మరోసారి ఫ్రెంచ్ ఓపెన్ ఆడే అవకాశాలు లేవు. ఒలింపిక్స్తో అతను తన కెరీర్లో దాదాపు చివరి మ్యాచ్ ఆడేసినట్లే. తొలి రౌండ్లో నాదల్ 6-1, 4-6, 6-4తో పుస్కోవిచ్(హంగేరి)పై విజయం సాధించాడు. కానీ రెండో రౌండ్లో సెర్బియా దిగ్గజం జకోవిచ్ చేతిలో ఖంగుతిన్నాడు. జకోవిచ్-రఫెల్ నాదల్ మ్యాచ్ చూసేందుకు టెన్నిస్ అభిమానులు భారీగా తరలి వచ్చారు.