పారిస్ ఒలింపిక్స్ 2024లో పతకమే లక్ష్యంగా అడుగుపెట్టిన భారత బాక్సర్, వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్కు కఠినమైన డ్రా లభించింది. బాక్సింగ్కు సంబంధించిన డ్రాను పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు శుక్రవారం ప్రకటించారు. 50 కేజీల బాక్సింగ్ ఈవెంట్లో పోటీ పడుతున్న నిఖత్ జరీన్.. తొలి మ్యాచ్లో జర్మనీ బాక్సర్ కరీనా క్లొయెట్జర్తో తలపడనుంది.
క్లొయెట్జర్పై విజయం సాధిస్తే రెండో రౌండ్లో వరల్డ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన చైనా బాక్సర్ వూ యూతో అమీతుమీ తేల్చుకోనుంది. టాప్ ర్యాంకర్ అయిన వ్యూ యూతో విజయం సాధించాలంటే నిఖత్ స్థాయికి మించి ప్రదర్శన చేయాలి.

నిఖత్ జరీన్తో పాటు టోక్యో ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్ లవ్లినా బోర్గోహైనాకు కూడా కఠినమైన డ్రా లభించింది. 75 కేజీల విభాగంలో పోటీ పడుతున్న లవ్లినా బోర్గోహైన్.. తొలి మ్యాచ్లో నార్వే బాక్సర్ సున్నివాతో తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే రెండో రౌండ్లో ఒలింపిక్ మెడలిస్ట్, చైనా బాక్సర్ లికియాన్తో అమీతుమీ తేల్చుకోనుంది.
మహిళల 54 కేజీల విభాగంలో మరో భారత బాక్సర్ జైస్మిన్ లంబోరియా తొలి రౌండ్లో ఫిలిప్పిన్స్ బాక్సర్ నెస్తీ పెటెసిను ఢీకొట్టనుంది. టోక్యో ఒలింపిక్స్లో ఫిలిప్పీన్స్ బాక్సర్ సిల్వర్ మెడల్ గెలిచింది. పురుషుల విభాగంలో నిషాంత్ దేవ్(71 కిలోలు), అమిత్ పంగల్(52 కిలోలు)కు మాత్రం బై దక్కింది. దాంతో ఈ ఇద్దరూ నేరుగా రెండో రౌండ్లో ఆడనున్నారు. శనివారం నుంచి బాక్సింగ్ పోటీలు జరగనున్నాయి.
పారిస్ ఒలింపిక్స్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. తొలిసారిగా స్టేడియంలో కాకుండా పారిస్ నగరంలోని సెన్ నదిపై ఆరంభం వేడుకలు నిర్వహించారు. కళ్లు జిగేల్ మనే లైటింగ్స్, వాటర్ విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. టోర్నీలో పాల్గొనే ఆయా దేశాల అథ్లెట్లు పడవల్లో పరేడ్ నిర్వహించారు. గ్రీస్ దేశంతో ఆటగాళ్ల పడవ పరేడ్ ప్రారంభమైంది. ఫ్రెంచ్ అక్షరాల ప్రకారం ఆయా దేశాలు పడవల్లో పరేడ్ నిర్వహించాయి.
ఒలింపిక్స్ జన్మస్థలమైన గ్రీస్కు గౌరవార్థంగా ఆ దేశాన్ని పరేడ్లో ముందు ఉంచుతారు. రెండో స్థానంలో శరణార్థుల ఒలింపిక్ టీమ్ వచ్చింది. 84వ దేశంగా భారత్ పరేడ్ నిర్వహించింది. భారత అథ్లెట్లంతా మన సంప్రదాయం ఉట్టిపడేలా దుస్తులు ధరించారు. మహిళా అథ్లెట్లంతా చీరకట్టులో మెరిసారు.