క్రికెట్లోనే కాదు.. పారిస్ ఒలింపిక్స్ 2024లోనూ భారత్, పాకిస్థాన్ సమరం ఆకట్టుకుంది. కానీ ఈసారి భారత్పై పాకిస్థాన్దే పైచేయి అయ్యింది. గురువారం అర్థరాత్రి జరిగిన పురుషుల జావెలిన్ త్రోయర్ ఫైనల్లో భారత్పై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది.
పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ హర్షద్ నదీమ్ ఒలింపిక్ రికార్డ్తో భారత్కు దక్కాల్సిన గోల్డ్ మెడల్ను ఎగరేసుకుపోయాడు. దాంతో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత జావెలిన్ త్రోయర్, డిఫెండింగ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా..రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

హర్షద్ నదీమ్ ఈటెను 92.97 మీటర్ల రికార్డ్ దూరం విసిరి ఆల్టైమ్ ఒలింపిక్ రికార్డ్ బద్దలు కొట్టడంతో పాటు బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఆరు ప్రయత్నాల్లో రెండు సార్లు 90 మీటర్ల కంటే ఎక్కువ దూరం ఈటెను విసిరాడు. అతని వ్యక్తిగత రికార్డ్ కూడా ఇదే కావడం విశేషం. తాజా గెలుపుతో పాకిస్థాన్ 32 ఏళ్ల మెడల్ నిరీక్షణకు తెరదించాడు.
1992 ఒలింపిక్స్లో చివరిసారిగా మెడల్ సాధించిన పాకిస్థాన్.. ఆ తర్వాత మళ్లీ గెలవలేదు. నదీమ్ తాజా ప్రదర్శనతో ఏకంగా స్వర్ణ పతకమే సాధించింది. ఈ ఒలింపిక్స్లో పాకిస్థాన్ గెలిచిన ఏకైక పతకం కూడా ఇదే కావడం గమనార్హం.
హర్షద్ నదీమ్ స్వర్ణంతో పతకాల పట్టికలో భారత్ కంటే పాకిస్థాన్ 10 స్థానాలు ముందంజలో నిలిచింది. భారత్ ఇప్పటి వరకు ఐదు పతకాలు గెలిచినా.. ఒక్క స్వర్ణం కూడా సాధించలేదు. నాలుగు కాంస్యాలతో పాటు ఓ రజతం మాత్రమే గెలిచి 63వ స్థానంలో కొనసాగుతుండగా.. పాకిస్థాన్ మాత్రం ఒక్క పతకం గెలిచినా అది స్వర్ణం కావడంతో 53వ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
డిఫెండింగ్ ఛాంపియన్, భారత జావెలియన్ త్రోయర్ నీరజ్ చోప్రా 89.45 మీటర్లతో రజతం సొంతం చేసుకోగా.. గ్రెనెడా ప్లేయర్ పీటర్స్ అండర్సన్ 88.54 మీటర్ల దూరం విసిరి కాంస్య పతకం అందుకున్నాడు. నీరజ్ చోప్రా రజతంతో సరిపెట్టడంతో భారత్ గోల్డ్ మెడల్ ఆశలు ఆవిరయ్యాయి.