పారాలింపిక్స్ 2024లో భారత్కు మరో స్వర్ణ పతకం దక్కింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3లో భారత పారా షట్లర్ నితేశ్ కుమార్ బంగారు పతకం సాధించాడు. తొలిసారి పారాలింపిక్స్ ఆడుతున్న నితేశ్ కుమార్ సోమవారం జరిగిన ఫైనల్లో 21-14, 18-21, 23-21 తేడాతో బ్రిటన్కు చెందిన డానియల్ బెతెల్ను ఓడించాడు. టోక్యో పారాలింపిక్స్లో సిల్వర్ సాధించిన బెతెల్.. ఈసారి కూడా రజతంతోనే సరిపెట్టుకున్నాడు.
ఈ మ్యాచ్ తొలి గేమ్లో భారత పారా షట్లర్ పూర్తి ఆధిపత్యం చెలాయించగా.. రెండో గేమ్ హోరాహోరీగా సాగింది. ఒక దశలో11-8తో ఆధిక్యంలో నిలిచిన నితేశ్.. తర్వాత కాస్త తడబడ్డాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న బెతెల్.. వరుస పాయింట్లు సాధించి గేమ్ను సొంతం చేసుకున్నాడు. నిర్ణయాత్మక మూడో గేమ్లో కూడా ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ఎలాంటి తప్పిదం లేకుండా ఆడిన నితేశ్ గేమ్తో పాటు మ్యాచ్ను కైవసం చేసుకొని సరికొత్త చరిత్ర సృష్టించాడు.

మరోవైపు ఎస్ఎల్4లో సుహాస్ యతిరాజ్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. గోల్డ్ మెడల్ కోసం అతను సోమవారం రాత్రి 9.40 గంటలకు ఫ్రాన్స్ పారా షట్లర్ లుకాస్తో తలపడనున్నాడు. నితేశ్ కుమార్ స్వర్ణంతో పారాలింపిక్స్ 2024 భారత్ పతకాల సంఖ్య 9కి చేరింది.