ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్ క్రికెట్ టోర్నీలో విచిత్రకర ఘటన చోటు చేసుకుంది. ఈ టోర్నీలో బ్యాటర్ హిట్ వికెట్ కావడంతో పాటు రనౌట్ అయినా అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. దాంతో క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా గందరగోళానికి గురయ్యారు. అంపైర్ ఘోర తప్పిదం చేశాడని భావించారు.
కానీ అంపైర్ మాత్రం నిబంధనల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశాడు. మెరిలిన్ క్రికెట్ బోర్డు(ఎంసీసీ) 31.7 రూల్ ప్రకారం బ్యాట్స్మన్ను నాటౌట్గా ప్రకటించానని వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.

అసలేం జరిగిందంటే..?
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న విటాలిటీ బ్లాస్ట్ టీ20 టోర్నీలో యార్క్షైర్, లాంక్షైర్ జట్ల మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో యార్క్షైర్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన పాకిస్థాన్ బ్యాటర్ షాన్ మసూద్.. లాంక్షైర్ బౌలర్ బ్లాథర్విక్ వేసిన 15వ ఓవర్లో హిట్ వికెట్ అయ్యాడు. భారీ షాట్ ఆడే క్రమంలో అదుపు తప్పిన షాన్ మసూద్ కాలితో వికెట్లను తాకాడు. దాంతో బెయిల్స్ కిందపడ్డాయి.
షాన్ మసూద్ కూడా ఔటయ్యానని భావించాడు. కానీ అదే సమయంలో అంపైర్ నోబాల్గా గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. నాన్ స్ట్రైకర్గా ఉన్న జోరూట్ రన్ కోసం వచ్చాడు. కానీ హిట్ వికెట్ అయ్యానని భావించిన షాన్ మసూద్ పరుగెత్తలేదు. అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్లు వికెట్లను గిరాటేశారు. దాంతో మసూద్ ఔట్ అయ్యాడని అంతా భావించారు. కానీ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చి అసలు ట్విస్ట్ ఇచ్చాడు.
ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయి..?
ఎంసీసీ రూల్ 31.7 ప్రకారం.. బ్యాటర్ ఔట్ అయినట్లు భావించి.. పరుగు కోసం ప్రయత్నించకుండా రనౌటయ్యాడని అంపైర్ భావిస్తే నాటౌట్ ఇవ్వవచ్చు. మసూద్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించడంతో అంపైర్ సంతృప్తి చెందాడు. దాంతోనే నాటౌట్గా ప్రకటించాడు. బౌలర్ వేసిన బంతి నోబాల్ కావడంతో హిట్ వికెట్ కాకుండా తప్పించుకున్న మసూద్... అంపైర్ నిర్ణయంతో రనౌట్ అయినా.. నాటౌట్గా నిలిచాడు.
అయితే ఈ అవకాశాన్ని షాన్ మసూద్ అందిపుచ్చుకోలేకపోయాడు. మరో మూడు పరుగుల వ్యవధిలోనే ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో యార్క్షైర్ జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.