ఆసియా కప్ 2025 టోర్నీ తుది పోరుకు రంగం సిద్దమైంది. మరికొద్ది క్షణాల్లో ఈ మెగా ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలోనే తొలిసారి భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్లో తలపడుతున్నాయి. ఇప్పటికే ఈ టోర్నీలో పాకిస్థాన్ను రెండు సార్లు చిత్తు చేసిన టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో ఉంది. మరోవైపు కనీసం ఫైనల్లో అయినా ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని దాయాదీ పాకిస్థాన్ భావిస్తోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అయితే ఫామ్ చూసుకున్నా.. బలబలాలు పరిశీలించినా.. ఈ మ్యాచ్లో టీమిండియాకు పాకిస్థాన్ ఏ మాత్రం పోటీ కాదు. అంతర్జాతీయ టీ20ల్లో ముఖా ముఖి పోరులోనూ భారత్దే 12-3తో పైచేయిగా ఉంది. కానీ టీ20 ఫార్మాట్లో ఏ జట్టును తక్కువ అంచనా వేయలేం. మరోవైపు రెండు సార్లు దెబ్బతిన్న పాకిస్థాన్.. పగతో రగిలిపోతుంది. ఫైనల్లో ఓడించి ఇజ్జత్ కాపాడుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగుతున్న భారత జట్టును దెబ్బ తీసేందుకు పాకిస్థాన్ రెండు వ్యూహాలను సిద్దం చేసినట్లు తెలుస్తోంది.

ఇందులో మొదటి వ్యూహం.. భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం. అందుకోసం మైదానంలో భారత ఆటగాళ్లను కవ్వించడం, వారి ఏకాగ్రత దెబ్బతీయాలని పాకిస్థాన్ ప్రణాళిక రచించింది. సూపర్-4 మ్యాచ్లో ఇప్పటికే పాకిస్థాన్ ఆటగాళ్లు ఈ దిశగా ప్రయత్నించి విఫలమయ్యారు. అయినా మరోసారి భారత బ్యాటర్ల ఏకాగ్రత దెబ్బతీసేలా రెచ్చగొట్టి వారిని ఔట్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఇక రెండో వ్యూహం ఏంటంటే.. ఫాస్ట్ బౌలర్లు ప్రతీ ఓవర్లో కనీసం మూడు యార్కర్లు సంధించడం. విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగుతున్న భారత బ్యాటర్లను కచ్చితమైన యార్కర్లు, వైడ్ యార్కర్లతోనే కట్టడి చేయాలనేది పాక్ టీమ్ ప్రణాళిక. ముఖ్యంగా షాహిద్ అఫ్రిది ఇన్ స్వింగ్ యార్కర్లతో పవర్ ప్లేలోనే భారత బ్యాటర్ల వికెట్లు తీయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నెట్స్లో అతను యార్కర్లు ముమ్మరంగా సాధన చేశాడు.
అతనితో పాటు ఇతర పేస్ బౌలర్లు కూడా యార్కర్లు ప్రాక్టీస్ చేశాడు. స్లోయర్ షార్ట్స్ బాల్స్తో పాటు భారత బ్యాటర్ల మైండ్ సెట్కు తగ్గట్లు బౌలింగ్ వేరియేషన్స్లో మార్పులు చేయాలని పాక్ కోచ్ వారికి సూచించాడు. త్వరగా వికెట్లు తీసి భారత్పై ఒత్తిడి తీసుకొస్తే ఈ మ్యాచ్లో విజయం సాధించవచ్చని పాకిస్థాన్ భావిస్తోంది.