ఆసికప్ 2025 టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ ఫలితం కంటే.. షేక్ హ్యాండ్ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో కనీస పోటీ ఇవ్వలేకపోయిన పాకిస్థాన్.. తమ చెత్తాటను విశ్లేషించుకోవాల్సింది పోయి భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదని గగ్గోలు పెడుతోంది. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం ఏదో పెద్ద నేరం అన్నట్లు కొత్త డ్రామాకు తెరలేపింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఐసీసీకి ఫిర్యాదు చేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ).. భారత జట్టుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
అంతేకాకుండా టాస్ సమయంలో భారత కెప్టెన్కు షేక్ హ్యాండ్ ఇవ్వద్దని మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ తమ కెప్టెన్కు చెప్పాడని, అతన్ని తక్షణమే తొలగించాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. లేకపోతే టోర్నీ నుంచి వైదొలుగుతామని కూడా హెచ్చరించింది. కానీ ఈ ఫిర్యాదును ఐసీసీ తోసిపుచ్చింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ రూల్స్ ప్రకారమే నడుచుకున్నారని, ఆయనను తొలగించడం కుదరదని ఐసీసీ స్పష్టం చేసింది.

మ్యాచ్ రిఫరీపై చర్యలు తీసుకోకపోతే టోర్నీని బహిష్కరిస్తామని హెచ్చరించిన పీసీబీ.. ఐసీసీ తీరుతో తోక ముడిచింది. మ్యాచ్ రిఫరీని తొలగించడం కుదరదని స్పష్టం చేయడంతో మౌనం వహించింది. టోర్నీ నుంచి వైదొలిగితే ఆర్థికంగా నష్టపోతామని గ్రహించి తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఐసీసీపై కోపంతో ఎచ్చులకు పోయి టోర్నీ నుంచి తప్పుకుంటే పాకిస్థాన్ దాదాపు రూ. 454 కోట్లు(16 మిలియన్ల అమెరికా డాలర్లు) రెవెన్యూను కోల్పోవాల్సి ఉంటుంది.
టెస్ట్ హోదా కలిగిన భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ జట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) వార్షిక ఆదాయం నుంచి 15 శాతాన్ని పొందుతున్నాయి. అసోసియేషన్ నేషన్స్ మరో 25 శాతాన్ని పంచుకుంటున్నాయి. ఇదే కాకుండా ఆసియాకప్ బ్రాడ్ కాస్టింగ్, స్పాన్సర్షిప్స్ ఒప్పందాలు, టికెటింగ్ మనీ ద్వారా ఏసీసీకి ఆదాయం వస్తుంది. ఈ లెక్కన ఆసియా కప్ ద్వారానే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 12 నుంచి 16 మిలియన్ అమెరికా డాలర్లను ఆర్జించనుంది. ఇవేవి ఆలోచించకుండా టోర్నీ నుంచి తప్పుకుంటే ఆర్థికంగా పీసీబీ తీవ్రంగా నష్టపోనుంది.
ఈ క్రమంలోనే షేక్ హ్యాండ్ వివాదంపై పాక్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ కోసం 2024-2031 కాలానికి ఆసియా క్రికెట్ కౌన్సిల్తో సోనీ నెట్వర్క్ 170 మిలియన్ అమెరికా డాలర్లకు ఒప్పందం కుదుర్చుకుంది. అండర్ 19 పురుషులు, మహిళల ఆసియా కప్ రైట్స్ కూడా ఇందులో భాగమే. టోర్నీని బాయ్కట్ చేయడంపై వెనక్కి తగ్గిన పాకిస్థాన్.. తమ నిరసనను మాత్రం కొనసాగిస్తోంది. షేక్ హ్యాండ్ వివాదం నేపథ్యంలో యూఏఈతో మ్యాచ్ నేపథ్యంలో నిర్వహించిన మీడియా సమావేశానికి పాకిస్థాన్ జట్టు దూరంగా ఉంది. భారత్తో మ్యాచ్ అనంతరం కూడా పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో పాల్గొనని సంగతి తెలిసిందే.