ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ఇంకా 42 రోజుల సమయం మాత్రమే ఉండగా.. స్డేడియాల రినోవేషన్ ఇంకా పూర్తవ్వలేదు. స్టేడియాల పునరుద్దరణ పనులు మందకోడిగా సాగుతున్నాయి. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది.
ఈ మినీ ప్రపంచకప్ డెడ్లైన్కు ఇంకా 35 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలోనే స్టేడియాల రినోవేషన్ పనులన్నింటినీ పూర్తి చేయాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు హైబ్రిడ్ మోడల్లో జరగనుంది. టీమిండియా మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత పాకిస్థాన్.. ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది.

ఈ క్రమంలోనే స్టేడియాల పునరుద్దరణ కార్యక్రమం చేపట్టింది. ఇందుకు సంబంధించి ఐసీసీ నుంచి కోట్ల రూపాయాలు తీసుకుంది. పాకిస్థాన్లో కరాచీ నేషనల్ స్టేడియం, లాహోర్లో గడాఫీ స్టేడియం, రావల్పిండి క్రికెట్ స్టేడియాలను పీసీబీ రినోవేషన్ చేస్తోంది. అయితే ఈ పనులు ఇంకా పూర్తవ్వలేదు. పీసీబీ.. ఐసీసీ అపెక్స్ బాడీకి ఫిబ్రవరి 12లోపు స్టేడియాలను అప్పగించాల్సి ఉంటుంది. అంతకు ఓవారం ముందు ఐసీసీ స్టేడియాలను తనిఖీ చేసి తుది నిర్ణయం తీసుకోనుంది.
ఒకవేళ స్టేడియాల నిర్మాణాలు పూర్తవ్వకుంటే ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తాన్ని యూఏఈకి తరలించే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
'పాకిస్థాన్ క్రికెట్ స్టేడియాలకు సంబంధించి నిరాశపరిచే చిత్రాలు కనిపిస్తున్నాయి. మూడు స్టేడియాలు ఇంకా సిద్దం కాలేదు. రినోవేషన్ పనులు పూర్తవ్వలేదు. ఇంకా పనులు జరుగుతున్నాయి. సీట్లు, ఫ్లడ్ లైట్స్, ఔట్ ఫీల్డ్, ఆట స్థలంతో పాటు కనీస సౌకర్యాలకు సంబంధించిన చాలా పనులు మిగిలి ఉన్నాయి.'అని ఓ పీసీబీ అధికారి మీడియాకు తెలిపాడు. ప్రస్తుతం స్టేడియాల నిర్మాణాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఫొటోలు, వీడియోలను చూసిన నెటిజన్లు ఇక ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినట్లేనని నిట్టూరుస్తున్నారు.