పాకిస్థాన్ క్రికెటర్లు ప్లాన్ ప్రకారమే కవ్వింపులకు పాల్పడుతున్నారు. భారత్ చేతిలో ఎదురైన పరాజయాన్ని జీర్ణించుకోలేక.. అసత్య విషయాలను నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఆసియా కప్ 2025లో భాగంగా భారత్తో జరిగిన సూపర్-4 మ్యచ్లో పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో హరీస్ రౌఫ్ 6-0 అంటూ సైగలు చేశాడు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత్ ప్రయోగించిన 6 రఫేల్ జెట్లను కూల్చామనే విషయాన్ని తెలియజేసేలా సంజ్ఞలు చేశాడు.
6 రఫెల్ జెట్ ఫ్లైట్స్ను కూల్చామని ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ అబద్దపు ప్రకటన చేసింది. ఇప్పటి వరకు ఈ 6 జెట్ ఫ్లైట్స్కు సంబంధించిన ఆధారాలను బయటపెట్టలేదు. కానీ ఇది నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. భారత్తో హారీస్ రౌఫ్ 6-0 సంజ్ఞతో పాటు రఫెల్ ఫ్లైట్ను కూల్చేసామనే సైగలు కూడా చేశాడు. అతని తీరుపై సర్వత్రా విమర్శలు రాగా.. పాకిస్థాన్ నుంచి మాత్రం అతనికి మద్దతు పెరగుతోంది. హరీస్ రౌఫ్ సతీమణి సైతం అతని 6-0 సంజ్ఞను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. మ్యాచ్ ఓడినా.. యుద్దం గెలిచామని క్యాప్షన్గా పేర్కొంది.

హరీస్ రౌఫ్కు మద్దతుగా అందరూ 6-0 సంజ్ఞతో సంబరాలు చేసుకోవాలనే ఆదేశాలు పాక్ ప్రభుత్వం నుంచి క్రీడాకారులందరికి అందినట్లు తెలుస్తోంది. సోమవారం సౌతాఫ్రికాతో జరిగిన మహిళల వన్డే మ్యాచ్లోనూ పాకిస్థాన్ లేడీ క్రికెటర్లు నష్రా సంధు, సిద్ర అమిన్ 6-0 సంజ్ఞ చేశారు. అయితే వారి వ్యక్తిగత ప్రదర్శనను ప్రతిబించించేలా సంబరాలు చేసుకున్నారని, భారత్ను ఉద్దేశించి కాదని కొందరు పాక్ జర్నలిస్ట్లు పోస్ట్లు పెడుతున్నారు. కానీ ఉద్దేశపూర్వకంగానే ఈ సంజ్ఞలు చేశారనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.
శ్రీలంకలో జరుగుతున్న సాఫ్ అండర్ 17 టోర్నీలో భాగంగా భారత్తో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్లో పాక్ ప్లేయర్ మహమ్మద్ అబ్దుల్లా కూడా ఇదే తరహా సంజ్ఞలు చేశాడు. గోల్ చేసిన వెంటనే భారత యుద్ద విమానాలు కూలిపోయాయనే సంజ్ఞలు చేయడంతో పాటు 2019లో భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాక్ విచారణ చేసే సమయంలో టీ తాగేఫొటో వైరల్ కావడంతో అలా యాక్ట్ చేస్తూ ట్రోల్ చేశాడు. అయితే ఈ మ్యాచ్లో భారత్ 3-2 తేడాతో పాకిస్థాన్ను ఓడించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పాకిస్థాన్ నెటిజన్లు షేర్ చేస్తుండగా.. భారత నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. యుద్దమైనా.. మ్యాచ్ అయినా.. భారత్దే విజయమని స్పష్టం చేస్తున్నారు.