
సెంచూరియన్: సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో పాకిస్థాన్ బోణీ కొట్టింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా జరిగిన తొలి వన్డేలో పాకిస్థాన్ మూడు వికెట్ల తేడాతో గెలుపొంది ఊపిరి పీల్చుకుంది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో కెప్టెన్ బాబర్ ఆజామ్ (104 బంతుల్లో 17 ఫోర్లతో 103) సెంచరీతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్లకు 273 పరుగులు సాధించింది. 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సౌతాఫ్రికాను డస్సెన్ అజేయ శతకం (134 బంతుల్లో 123 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్లు)తో ఆదుకున్నాడు. అతడు మిల్లర్ (50; 5 ఫోర్లు)తో కలిసి ఐదో వికెట్కు 116 పరుగులు జోడించాడు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్ రెండేసి వికెట్లు తీశారు.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన పాకిస్థాన్ సరిగ్గా 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఛేదనలో పాక్ 9/1తో ఆరంభంలో తడబడింది. కానీ ఇమాముల్ హక్ (70)తో కలిసి ఇన్నింగ్స్ను నడిపించిన బాబర్.. రెండో వికెట్కు 177 పరుగులు జత చేసి విజయానికి గట్టి పునాది వేశాడు. కానీ స్వల్ప తేడాతో బాబర్, హక్ ఔట్ కావడంతో పాక్ 186/1 నుంచి 203/5తో ఇబ్బందుల్లో పడింది. ఈ స్థితిలో రిజ్వాన్ (40), షాదాబ్ఖాన్ (33) నిలిచి పాక్ను విజయానికి చేరువ చేశారు. రిజ్వాన్ ఔటైనా షాదాబ్ ఆఖరి వరకు నిలవడంతో పాక్ విజయం సులభమే అనిపించింది.
కానీ చివరి ఓవర్లో పాకిస్థాన్ను సౌతాఫ్రికా పేసర్ ఫెలుక్వాయో కంగారెత్తించాడు. పాక్ విజయానికి కేవలం మూడు పరుగులు అవసరమయ్యాయి. చేతిలో నాలుగు వికెట్లున్నా.. ఆఖరి ఓవర్ వేసిన ఫెలుక్వాయో తొలి బంతికి షాదాబ్ ఖాన్ (30 బంతుల్లో ఫోర్లు, సిక్స్తో 33)ను ఔట్ చేశాడు. తర్వాతి మూడు బంతులకు ఫెలుక్వాయో ఒక్క పరుగూ ఇవ్వలేదు. దాంతో పాక్ విజయ సమీకరణం రెండు బంతుల్లో మూడు పరుగులుగా మారింది. అయితే ఫాహిమ్ అష్రఫ్ (5 నాటౌట్) ఐదో బంతికి రెండు పరుగులు, చివరి బంతికి ఒక పరుగు సాధించి పాకిస్థాన్ను గట్టెక్కించాడు. రెండో వన్డే జొహన్నెస్బర్గ్లో ఆదివారం జరుగుతుంది.