
కరాచీ: పాకిస్థాన్తో జరుగుతున్న తొలి టెస్ట్లో సౌతాఫ్రికా తడబాటు కొనసాగుతోంది. యాసిర్ షా (3/53) స్పిన్ మ్యాజిక్తో ఆట చివరలో మూడు వికెట్లు పడగొట్టిన పాకిస్థాన్ పర్యాటక జట్టుపై పైచేయి సాధించింది. ఆధిపత్యం చేతులు మారుతూ సాగిన ఈ మ్యాచ్లో గురువారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లకు 187 పరుగులు చేసింది. ప్రస్తుతానికి 29 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది. ఓపెనర్ మార్క్రమ్ (74), వాన్ డెర్ డస్సెన్ (64) అర్ధ సెంచరీలతో సత్తా చాటడంతో ఓ దశలో 175/1తో పటిష్ట స్థితిలో నిలిచిన ఆ జట్టు.. పాక్ స్పిన్నర్ల దెబ్బకు 10 పరుగుల తేడాలో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం కెప్టెన్ క్వింటన్ డికాక్(0 బ్యాటింగ్), కేశవ్ మహారాజ్(2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 308/8తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాక్ 378 వద్ద ఆలౌటైంది. దాంతో ఆ జట్టుకు 158 పరుగుల ఆధిక్యం దక్కింది. ఓవర్నైట్ బ్యాట్స్మన్ హసన్ అలీ(24) త్వరగానే ఔటైనా.. యాసిర్ షా(38 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్తో ఊహించిన దాని కంటే ఎక్కువ లీడ్ అందించాడు. రబాడ(3/70), కేశవ్ మహారాజ్(3/90) తలో మూడు వికెట్లు తీశారు. అనంతరం 158 పరుగుల లోటుతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలకు మంచి శుభారంభం దొరికింది.
ఓపెనర్లు మార్కర్మ్, డీన్ ఎల్గర్(29) తొలి వికెట్లకు 48 రన్స్ జోడించారు. అపై, మార్క్రమ్, డుసెన్ రెండో వికెట్కు 48 రన్స్ భాగస్వామ్యాన్ని అందించి జట్టును ఆధిక్యంలోకి తెచ్చారు. ఈ దశలో పాక్ బౌలర్లు పుంజుకున్నారు. డుసెన్, డుప్లెసిస్(10)ను యాసిర్ ఔట్ చేసి డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. కొద్దిసేపటికే మార్క్రమ్ను నౌమన్ అలీ పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన డికాక్, మహారాజ్ జాగ్రత్త పడ్డారు. మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 220 పరుగులకు ఆలౌటైంది.