ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో పాకిస్థాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ టోర్నీలో భాగంగా భారత్తో ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన లీగ్ మ్యాచ్ను బాయ్కాట్ చేస్తున్నట్టుగా పాకిస్థాన్ ప్రభుత్వం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే, ఈ టోర్నీలోని మిగతా మ్యాచ్లను మాత్రం ఆడుతామని స్పష్టం చేసింది.
'టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్థాన్ జట్టుకు ఇస్లామిక్ రిపబ్లిక్ పాకిస్థాన్ ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ ఫిబ్రవరి 15న భారత్తో జరగాల్సిన మ్యాచ్ను బహిష్కరించాలని సూచించింది.'అని పాకిస్థాన్ ప్రభుత్వం ఎక్స్ వేదికగా పేర్కొంది.

భారత్తో మ్యాచ్ ఆడకుండా పాకిస్థాన్ జట్టు బహిష్కరిస్తే.. ఆ జట్టుకే తీవ్ర నష్టం జరగనుంది. మ్యాచ్ జరగకపోతే భారత్ను విజేతగా ప్రకటించి 2 పాయింట్స్ ఇస్తారు. అయితే ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఇంకా ఐసీసీకి అధికారికంగా సమాచారం ఇవ్వలేదు. ఐసీసీకి అధికారికంగా పీసీబీ నుంచి లేఖ వస్తేనే.. ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయంపై స్పష్టత వస్తుంది. భారత్తో మ్యాచ్ని బాయ్కాట్ చేయడం వల్ల పాకిస్తాన్కి సూపర్ 8 చేరే అవకాశాలు కూడా దెబ్బతింటాయి.

భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దాదాపు 38 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.348 కోట్ల) నష్టపోవాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ క్రికెట్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ఉండే క్రేజ్ మరో మ్యాచ్కు ఉండదు. యావత్ క్రికెట్ ప్రపంచం ఈ మ్యాచ్ను ఆసక్తిగా తిలకిస్తోంది. దాంతో ఈ మ్యాచ్ ద్వారా బ్రాడ్కాస్టర్లు, స్పాన్సర్లు, అడ్వర్టైజింగ్ కంపెనీలు వందల కోట్లు సంపాదిస్తాయి.
భారత్-పాక్ మ్యాచ్కు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం దాదాపు రూ. 348 కోట్లు. ఇప్పటికే బ్రాడ్కాస్టర్స్ ఈ మ్యాచ్ నేపథ్యంలో ఆయా వ్యాపార సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాయి. పాక్ ఈ మ్యాచ్ను బహిష్కరిస్తే.. ఈ మొత్తాన్ని పీసీబీ నుంచి వసూలు చేయనున్నారు. ఐసీసీ నుంచి పీసీబీకి వచ్చే వాటాలో కోత కోసి మరి రికవరీ చేయనున్నారు.
పాకిస్థాన్ మాదిరిగానే తమ మ్యాచ్లను కూడా భారత్ నుంచి తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, ఐసీసీని డిమాండ్ చేసింది. ఇందుకు ఐసీసీ నిరాకరించడంతో టోర్నీ నుంచి తప్పుకుంది. దాంతో బంగ్లాదేశ్ స్థానంలో స్టాట్లాండ్ను ఐసీసీ ఎంపిక చేసింది. ఈ నిర్ణయంపై పాక్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తాము కూడా తప్పుకుంటే, భారత జట్టు.. ఉగాండాతో మ్యాచులు ఆడాల్సి ఉంటుందని సెటైర్లు పేల్చింది. చివరకు ప్రపంచకప్ బరిలోకి దిగినా.. భారత్తో ఆడకూడదని పాక్ నిర్ణయించుకుంది.