
కరాచీ: సులువైన స్టంపౌట్ను చేజార్చి అభాసుపాలైన పాకిస్థాన్ మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్కు ఆ జట్టు టెస్ట్ కెప్టెన్ అజహర్ అలీ అండగా నిలిచాడు. విమర్శకులకు ఆటతోనే సమధానం చెప్తాడని, ఆ అల్లా దయ సర్ఫరాజ్కు ఉంటుందని ట్వీట్ చేశాడు. ఇక మంగళవారం ఇంగ్లండ్తో జరిగిన చివరి టీ20లో అవకాశం దక్కించుకున్న సర్ఫరాజ్ తన లేజీ వికెట్ కీపింగ్తో తీవ్ర విమర్శలపాలయ్యాడు.
ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీని సులువుగా స్టంపింగ్ చేసే అవకాశాన్ని చేజార్చాడు. ఈ అవకాశంతో చెలరేగిన మొయిన్ అలీ.. 61 పరుగులతో ఇంగ్లండ్ను గెలిపించేంత పనిచేశాడు. కానీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాక్ 5 పరుగుల తేడాతో గెలుపొంది ఊపిరి పీల్చుకుంది. ఈ ఫలితంతో మూడు టీ20ల సిరీస్ను 1-1తో సమం చేసింది.
ఇక సులువైన స్టంపౌట్ను చేజార్చడంపై నెటిజన్లు జోకులు, ఫన్నీ మీమ్స్ పేల్చుతూ సర్ఫరాజ్ను ఓ ఆట ఆడుకున్నారు. 'ఓయ్.. సర్ఫరాజ్ నిద్రపోయావా.. లేక బ్యాట్స్మన్ పర్మీషన్ కావాలా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతకుముందు మ్యాచ్లో బెంచ్కే పరిమితమైన సర్ఫరాజ్ ఆవలింతలు తీస్తూ కెమెరాకు చిక్కాడు. దీంతో మూడు ఫార్మాట్లలో ఆవలింతలు తీసిన ఏకైక క్రికెటర్ అంటూ ట్రోల్ చేశారు. అతన్ని ఓ జోకర్లా భావిస్తూ ఆడుకున్నారు.
ఇక తనపై సోషల్ మీడియా వేదికగా జరగుతున్న ట్రోలింగ్పై సర్ఫరాజ్ స్పందించాడు. ట్విటర్ వేదికగా ఉర్దూలో ఘాటు వ్యాఖ్యలు చేస్తూ విమర్శలను తిప్పికొట్టాడు. సర్ఫరాజ్ చేసిన ట్వీట్ను రిట్వీట్ చేస్తూ అజహర్ అలీ తన మద్దతు ప్రకటించాడు. 'భయ్యా.. మీకున్న చాలా మంది అభిమానుల్లో నేను ఒకడిని. నిన్ను విమర్శించేవారికి నీ ప్రదర్శనతోనే సమాధానం ఇస్తావు. ఆ అల్లా కూడా ఎప్పుడు నీవెంటే ఉంటాడు. పాకిస్థాన్ జట్టుకు ఎంతో చేశావు. మరెన్నో విజయాలందించావు. ఈ సిరీస్లో కూడా మంచి సానుకూల ధృక్పథంతో కనిపించావు.. దానిని అలాగే కొనసాగించు.'అని పేర్కొన్నాడు. కాగా గతంలో సర్ఫరాజ్ పాక్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. తన సారథ్యంలోనే పాక్ 2017 చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. వన్డే వరల్డ్కప్ అనంతరం కెప్టెన్ పదవితో పాటు జట్టులో చోటు కోల్పోయిన సర్ఫరాజ్.. మళ్లీ ఇంగ్లండ్ టూర్కు ఎంపికయ్యాడు.