అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ), టీమిండియా తీరును తప్పుబడుతూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తమ నిరసనను తెలియజేసింది. బుధవారం యూఏఈతో జరగనున్న డూ ఆర్ డై మ్యాచ్ కోసం మైదానానికి రాకుండా పీసీబీ బెదిరింపులకు దిగింది. చివరకు నిర్వాహకులు, ఐసీసీ ప్రతినిధుల సంప్రదింపుల అనంతరం మ్యాచ్ ఆడేందుకు అంగీకరించింది. దాంతో షెడ్యూల్ ప్రకారం 8 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభం కానుంది.
పాకిస్థాన్ జట్టు దుబాయ్ మైదానానికి వెళ్లేందుకు సిద్దమైందని పీసీబీ ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ ట్వీట్ చేశారు.భారత్తో మ్యాచ్ అనంతరం నెలకొన్న షేక్ హ్యాండ్ వివాదాన్ని సీరియస్గా తీసుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించాలని ఐసీసీ కోరింది.

టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు షేక్ హ్యాండ్ ఇవ్వద్దని మ్యాచ్ రిఫరీ తమ సారథి సల్మాన్ అలీ అఘాకు చెప్పారని, ఇది రూల్స్ విరుద్దమని అతనిపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అతనిపై చర్యలు తీసుకోకుంటే ఆసియా కప్ నుంచి వైదొలుగుతామని హెచ్చరించింది. కానీ ఐసీసీ మాత్రం పీసీబీ ఫిర్యాదును తోసిపుచ్చింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ రూల్స్ ప్రకారమే నడుచుకున్నాడని, అతని తప్పేం లేదని పేర్కొంది. ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించడం కుదరదని స్పష్టం చేసింది.
ఐసీసీ వివరణపై మౌనం వహించిన పాకిస్థాన్.. యూఏఈతో మ్యాచ్ ప్రారంభానికి ముందు హైడ్రామాకు తెరలేపింది. టోర్నీలో కొనసాగాలా వద్దా? అనే విషయంపై తమ బోర్డు ప్రతినిధులు చర్చించుకుంటున్నారని సమాచారం ఇచ్చింది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ జట్టు ఇంకా దుబాయ్ మైదానానికి చేరుకోలేదు. దాంతో ఈ మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. షెడ్యూల్ ప్రకారం రాత్రి 7.30 గంటలకే టాస్ వేయాల్సి ఉండగా.. ఇంకా వేయలేదు.