ఇస్లామాబాద్ : ఆస్ట్రేలియా వేదికగా వచ్చే నెలలో జరగనున్న టీ20 వరల్డ్కప్కు తనను ఎంపికచేయలేదనే ఆగ్రహంతో ఓ మహిళా క్రికెటర్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. జోకర్లా వ్యవహరిస్తూ.. జోకర్కున్న విలువను తగ్గించవద్దని ఘాటుగా ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ మహిళా క్రికెటర్ ఎవరంటే పాకిస్థాన్ స్టార్ బౌలర్ సనా మిర్.
గతంలో జరిగిన మూడు వరల్డ్కప్లు ఆడిన ఈ పాకిస్థాన్ సీనియర్ పేసర్, 'సెకండ్ హయ్యెస్ట్ వికెట్ టేకర్కు తాజా వరల్డ్కప్ నేపథ్యంలో 15 మంది సభ్యులతో ఎంపిక చేసిన జట్టులో చోటుదక్కలేదు. అయితే ఇటీవల ఆమె ఫామ్ను పరిగణలోకి తీసుకొనే ఎంపికచేయలేదని సెలెక్టర్లు ప్రకటించారు. 'సనా మిర్ జట్టుకు ఎంపిక కాలేదు. కానీ అనుభవం గల ప్లేయర్లు జట్టులో ఉన్నారు. సనా పాకిస్థాన్ క్రికెటకు అద్భుతమైన సేవలు అందించింది. ఎంతోమంది యువ క్రికెటర్లకు స్పూర్తిదాయకంగా నిలిచింది. దురదృష్టవశాత్తు ఇటీవల ఆమె ఆట పేలవంగా మారింది. అందుకే ప్రపంచకప్ టీమ్లో భాగంకాలేకపోయింది'అని మహిళల సెలెక్షన్ కమిటీ ఛీప్ ఉరూజ్ ముంతాజ్ తెలిపింది.
ఈ వ్యాఖ్యలపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సనా ట్వీట్ చేసింది. 'జోకర్లా ప్రవర్తిస్తూ జోకర్కున్న విలువను తగ్గించవద్దు. కనీసం వరల్డ్కప్ టూర్కు ఎందుకు వెళుతున్నారో మీకు మీరు ప్రశ్నించుకోండి'అని ఘాటుగా కామెంట్ చేసింది. అయితే సెలెక్టర్లన్నట్లు సనా ఆట ఫేలవంగానే ఉంది. గత నాలుగు మ్యాచ్ల్లో ఆఫ్స్పిన్నర్ అయిన సనా.. కేవలం ఒక వికెట్ మాత్రమే తీసింది. అంతేకాకుండా మలేషియా వేదికగా ఇంగ్లండ్తో జరిగిన లిమిటెడ్ ఓవర్ల సిరీస్కు దూరంగా ఉంది. ఇదే ఆమె కొంపముంచింది. వరల్డ్కప్ టీమ్కు ఎంపిక కాకుండా చేసింది.
ఇక 15 మంది సభ్యులతో కూడిన పాకిస్థాన్ జట్టును బిస్మా మరూఫ్ నడిపించనుండగా.. జవేరియా ఖాన్ వైస్ కెప్టెన్గా వ్యవహరింనుంది. ఇక ఫిబ్రవరి 26న జరిగే వెస్టిండీస్తో పాక్ మహిళలు తమ వరల్డ్కప్ క్యాంపైన్ మొదలు పెట్టనున్నారు. జనవరి 31నే ఆస్ట్రేలియాకు చేరుకోనున్న పాక్ టీమ్..ఫిబ్రవరి 7,9,11 తేదీల్లో విండీస్తో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్ల్లో పాల్గొననుంది.