ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీలో పాకిస్థాన్ షాహీన్స్ టీమ్ విజేతగా నిలిచింది. ఆదివారం దోహా వేదికగా బంగ్లాదేశ్-ఏ జట్టుతో హోరాహోరీగా సాగిన ఫైనల్లో పాకిస్థాన్ షాహీన్స్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ షాహీన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులే చేసింది.
సాద్ మసూద్(26 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 38), అర్ఫత్ మిన్హాస్(23 బంతుల్లో 4 ఫోర్లతో 25), మాజ్ సదకత్(18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 23) టాప్ స్కోరర్లుగా నిలిచారు. బంగ్లాదేశ్-ఏ బౌలర్లలో రిపన్ మోండల్(3/25) మూడు వికెట్లు తీయగా.. రకిబుల్ హసన్(2/16) రెండు వికెట్లు పడగొట్టాడు. మెహెరోబ్, జిషన్ అలామ్, అబ్దుల్ గఫ్ఫర్ సక్లెయిన్ తలో వికెట్ తీసారు.

అనంతరం బంగ్లాదేశ్-ఏ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులే చేసింది. హబిబుర్ రెహ్మాన్ సోహన్(17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 26), రకిబుల్ హసన్(21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పాకిస్థాన్ షాహీన్స్ బౌలర్లలో సుఫియన్ ముఖీమ్(3/11)మూడు వికెట్లు తీయగా.. అర్ఫత్ మిన్హాస్(2/5), అహ్మద్ దనియల్(2/11) రెండేసి వికెట్లు పడగొట్టారు.
ఆఖరి ఓవర్లో బంగ్లాదేశ్ విజయానికి 7 పరుగులు అవసరం కాగా.. ఆ జట్టు కేవలం 6 పరుగులే చేసింది. పాక్ బౌలర్ అహ్మద్ దనియల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. దాంతో సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్లో బంగ్లాదేశ్..3 బంతులే ఆడి 6 పరుగులే చేసి ఆలౌటైంది. సూపర్ ఓవర్ రూల్స్ ప్రకారం రెండు వికెట్లు పడితే ఆలౌటైనట్లు. మరోసారి అహ్మద్ దనియల్ అద్భుత బౌలింగ్తో ఆకట్టుకున్నాడు.
అనంతరం పాకిస్థాన్ నాలుగు బంతుల్లో లక్ష్యాన్ని ఛేదించి మరో ఎమర్జింగ్ ఆసియాకప్ టైటిల్ను ముద్దాడింది. పాకిస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన అహ్మద్ దనియాల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా.. మాజ్ సదఖత్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు వరించింది. భారత్-ఏతో సూపర్ ఓవర్లో విజయం సాధించిన బంగ్లాదేశ్-ఏ.. పాకిస్థాన్ షాహీన్స్తో మాత్రం ఆ జోరును కొనసాగించలేకపోయింది.