ఆసియాకప్ 2025 టోర్నీలో పాకిస్థాన్ జట్టును భారత్ చిత్తు చేసింది. ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే ఆటగాళ్ల షేక్ హ్యాండ్ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విజయానంతరం భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్స్కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపోయారు.
భారత ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వేచి చూసిన పాక్ ఆటగాళ్లు చివరకు నిరాశగా మైదానం వీడారు. అయితే ఈ షేక్ హ్యాండ్ వివాదాం ప్రస్తుతం తీవ్ర దుమారంగా మారింది. ఈ ఘటనను తీవ్ర అవమానంగా భావించిన పాకిస్థాన్.. భారత్ తీరును తప్పుబట్టింది. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్దమని పేర్కొంది. భారత జట్టుపై చర్యలు తీసుకోవాలని కూడా ఐసీసీని కోరింది. అంతేకాకుండా ఈ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్ను వెంటనే ఆసియా కప్ 2025 టోర్నీ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. లేకుంటే ఆసియా కప్ టోర్నీ నుంచి తప్పుకుంటామని ఐసీసీని హెచ్చరించింది.

ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ), ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడైన మోహ్సిన్ నఖ్వీ వరుస ట్వీట్లు చేశాడు. 'ఐసీసీ ప్రవర్తనా నియమావళి, క్రికెట్ స్ఫూర్తికి సంబంధించిన ఎంసీసీ చట్టాలను ఉల్లంఘించిన మ్యాచ్ రిఫరీపై ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. ఆసియా కప్ నుంచి సదరు మ్యాచ్ రిఫీరిని తక్షణమే తొలగించాలని పీసీబీ డిమాండ్ చేసింది.'అని మోహ్సిన్ నఖ్వీ ట్వీట్ చేశారు.
టాస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్కు షేక్ హ్యాండ్ ఇవ్వద్దని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకు మ్యాచ్ రిఫరీ సూచించాడని పీసీబీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇది క్రికెట్ నియమాలకు విరుద్దమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పాకిస్థాన్ కెప్టెన్.. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ను బహిష్కరించాడు. భారత మాజీ ఆటగాడు హోస్ట్గా వ్యవహరించడంతోనే సల్మాన్ అలీ అఘా ఓటమిపై బ్రాడ్కాస్టర్తో మాట్లాడలేదని తెలుస్తోంది.
మరోవైపు బీసీసీఐ అధికారి మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వడం రూల్ కాదని, స్నేహ పూర్వకంగా ఉన్నప్పుడు మాత్రమే ఇచ్చుకుంటారని తెలిపాడు. కావాలంటే రూల్ బుక్ చూసుకోవాలని, ఇదేం చట్టం కాదని, భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు.
ఈ వ్యవహరంపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సూర్య సేన చేసిన పనిని భారత అభిమానులు కొనియాడుతుంటే.. పాకిస్థాన్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు, దిగ్గజ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. ఆటను ఆటలా చూడాలని హితవు పలుకుతున్నారు.
అంతర్జాతీయ క్రికెట్లో క్రీడా స్ఫూర్తిని కాపాడటం ఇరు జట్ల ఆటగాళ్ల ప్రధాన బాధ్యత. ఐసీసీ రూల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ -2 ప్రకారం మ్యాచ్ అనంతరం ఇరు జట్లు అభినందించుకోవాలి.