ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో విజేతగా నిలవడం కంటే భారత్ను ఓడించడమే తమ జట్టు అసలు కర్తవ్యమని పాకిస్థాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ అన్నారు. ఈ విషయంతో యావత్ దేశం తమ జట్టుకు అండగా నిలుస్తోందని తెలిపారు. అప్కమింగ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ జట్లు ఫిబ్రవరి 23న తలపడనుంది. లండన్ వేదికగా జరిగిన గత ఎడిషన్ ఫైనల్లో భారత్ను ఓడించి పాకిస్థాన్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కరోనా, వన్డే, టీ20 ప్రపంచకప్ టోర్నీలతో ఐసీసీ.. ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించలేదు.
8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఆతిథ్యం ఇస్తోంది. పాకిస్థాన్ వెళ్లేందుకు భారత్ ససేమిరా అనడంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డుల పరస్పర అంగీకారంతో ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పాకిస్థాన్ ఒప్పుకుంది. దాంతో భారత్ మ్యాచ్లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి.

ఈ టోర్నీ కోసం భారీగా ఖర్చు చేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. స్టేడియాలను పునరుద్దరించింది. శనివారం లాహోర్లోని గడ్డాఫి స్టేడియాన్ని పాకిస్థాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్-పాక్ మ్యాచ్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'మాకు మంచి జట్టు ఉంది. ఇటీవల కాలంలో మా ఆటగాళ్లు మెరుగ్గా రాణిస్తున్నారు. అయితే మా జట్టు అసలు కర్తవ్యం ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే కాకుండా దుబాయ్ వేదికగా జరిగే దాయాదుల పోరులో చిరకాల ప్రత్యర్థిని భారత్ను ఓడించడం. ఈ విషయంలో దేశం మొత్తం పాకిస్థాన్ జట్టుకు వెన్నుదన్నుగా నిలుస్తోంది.
29 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తుండటం పాకిస్థాన్కు గొప్ప విషయం. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మా జట్టు యావత్ దేశం గర్వించేలా ఆడుతుందనే నమ్మకం నాకుంది.'అని షెహ్బాజ్ షరీఫ్ అన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దాయాదుల పోరుపై మరింత హైప్ను క్రియేట్ చేశాయి. ఈ స్టేడియం ప్రారంభ కార్యక్రమానికి పాకిస్థాన్లోని పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. పాకిస్థాన్ చివరిసారిగా 1996లో ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చింది.