కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు మార్గమం సుగుమమైంది. పాక్ ప్రధానమంత్రి, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ తమ జట్టు ఇంగ్లండ్ వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరోనా ముప్పు నేపథ్యంలో ఇంగ్లండ్ బోర్డు తీసుకుంటున్న చర్యలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ ఎహ్సాన్ మణి.. ఇమ్రాన్ను కలసి వివరించారు. దీంతో పాక్ టీమ్ ప్రయాణానికి ఇమ్రాన్ ఆమోదం తెలిపారు.
ఈ పర్యటనకు ఆటగాళ్ల కుటుంబ సభ్యుల్ని అనుమతించబోమని పీసీబీ వెల్లడించింది. కరోనా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.'జట్టుతో పాటు కుటుంబ సభ్యులను ఇంగ్లండ్కు తీసుకెళ్లినా.. ఇప్పుడున్న కరోనా క్వారంటైన్ పరిస్థితుల్లో వేరుగా ఉంచాల్సిందే. సెప్టెంబర్ దాకా జరిగే మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ ముగిసే దాకా కలిసే పరిస్థితే లేదు. అలాంటప్పుడు కుటుంబ సభ్యుల్ని అక్కడికి తీసుకెళ్లి ప్రయోజనం లేదు'అని ఒక పీసీబీ అధికారి తెలిపారు.
ఆగస్టు-సెప్టెంబరు మధ్యలో ఇంగ్లండ్, పాక్ జట్ల మధ్య మూడు 3 టెస్ట్లు, 3 టీ20లు జరగనున్నాయి. ఇందుకోసం 29 మంది క్రికెటర్లు, 14 మంది అధికారుల పాక్ బృందం ఈ నెలాఖరులో ఇంగ్లండ్కు బయల్దేరనుంది. ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్లో పాక్ ఆటగాళ్లను తరలించనున్నారు. 14 రోజుల క్వారంటైన్ అనంతరం బయో సెక్యూర్ వాతావరణంలో పాక్ జట్టు ఔట్ డోర్ ట్రైనింగ్ మొదలుపెట్టనుంది. పాక్తో ఆడేముందు వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్కు ఇంగ్లండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే విండీస్ జట్టు అక్కడికి చేరుకుంది. ఈ మూడు మ్యాచ్ల సిరీస్ వచ్చె నెల 8న ప్రారంభంకానుంది.
కరోనా కష్టకాలంలో ఇర్ఫాన్ పఠాన్ పెద్ద మనసు!