
దుబాయ్: ఊహించినట్లుగానే ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా పాకిస్థాన్ ఓపెనర్, వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ ఎంపికయ్యాడు. గతేడాది అద్భుత ప్రదర్శన కనబర్చిన రిజ్వాన్కు ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఈ విషయాన్ని ఐసీసీ ఆదివారం ప్రకటించింది. 2021లో 29 టీ20 మ్యాచ్లు ఆడిన మహమ్మద్ రిజ్వాన్ సూపర్ బ్యాటింగ్తో 1,326 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 134.89 కాగా యావరేజ్ 73.66 కావడం విశేషం.
గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లోనూ మహమ్మద్ రిజ్వాన్ అదరగొట్టాడు. సూపర్ బ్యాటింగ్తో పాక్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా భారత్తో జరిగిన కీలక పోరులో హాఫ్ సెంచరీతో మెరిసాడు. ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్ సెమీ ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ చేతిలో ఓడిన ఆ జట్టు... మరో సారి టైటిల్ గెలవకుండానే ఇంటిదారిపట్టింది.
అయితే ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా రిజ్వాన్ నిలిచాడు. గతేడాది ఆరంభం నుంచి పరుగుల వరద పారిస్తూ వచ్చిన అతను.. లాహోర్లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో సెంచరీ సాధించి.. టీ20ల్లో కెరీర్లోనే తొలి శతకం నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా తన దూకుడును కొనసాగించాడు. వెస్టిండీస్తో కరాచీలో జరిగిన మ్యాచ్లో 87 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న అప్కమింగ్ టీ20 ప్రపంచకప్లోనూ రిజ్వాన్ పాక్ తరఫున కీలకం కానున్నాడు.
బ్యాటింగ్లో అత్యుత్తమంగా రాణించిన ఇంగ్లండ్ క్రీడాకారిణి, వికెట్ కీపర్ ట్యామీ బ్యూమోంట్ ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎన్నికైంది. వీటితోపాటు మరిన్ని పురస్కారాలను ఐసీసీ ప్రకటించింది. మెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్గా సౌతాఫ్రికా ఆటగాడు జెన్నెమన్ మలన్ను ఐసీసీ ఎంపిక చేసింది. మెన్స్ అసోసియేట్ క్రికెటర్గా ఒమన్ ఆల్రౌండర్ ఆటగాడు జీషన్ మక్సూద్ను ఎన్నుకుంది. బ్యాటింగ్, బౌలింగ్తో జట్టుకు ఉత్తమ సేవలందించినందుకు గానూ ఈ పురస్కారాన్ని అందజేయనుంది.