కరాచీ: పాకిస్థాన్ లెఫ్టార్మ్ పేసర్ వాహబ్ రియాజ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఫ్రాంచైజీ క్రికెట్ ఆడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని 38 ఏళ్ల వాహబ్ తెలిపాడు. గత రెండేళ్లుగా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నానని ట్విటర్ వేదికగా తెలియజేశాడు.
'అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నా. అద్భుతమైన ప్రయాణాన్ని ముగించాలని నిర్ణయించుకున్నా. అంతర్జాతీయ క్రికెటర్గా నా ఎదుగుదలకు కృషి చేసిన పీసీబీ, నా కుటుంబం, కోచ్లు, మెంటార్స్, సహచర ఆటగాళ్లు.. నాకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. ఇక నుంచి ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫ్రాంచైజీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నా.

నేను గత రెండేళ్లుగా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నా. నా దేశం తరఫున శక్తివంచన లేకుండా ఆడా. ఇక నుంచి ఫ్రాంచైజీ క్రికెట్లోనా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తాను.'అని రియాజ్ ఓ సుదీర్ఘ పోస్ట్ను జత చేస్తూ ట్వీట్ చేశాడు.
ఇక పాకిస్థాన్ తరఫున వాహబ్ రియాజ్ చివరిసారిగా 2020 డిసెంబర్లో న్యూజిలాండ్తో ఆడాడు. రియాజ్ పాకిస్థాన్ తరఫున 2011, 2015, 2019 వన్డే ప్రపంచకప్ ఆడాడు. 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 27 టెస్ట్లు, 91 వన్డేలు, 36 టీ20 ఆడిన అతను మూడు ఫార్మాట్లలో కలిసి 237 వికెట్లు తీసాడు.
2010 ఆగస్టులో ఇంగ్లండ్తో ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఈ లెఫ్టార్మ్ పేసర్ పాక్ తరఫున అరంగేట్రం చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో పాక్ తరఫున 27 మ్యాచ్లు ఆడిన రియాజ్.. 34.50 సగటుతో 83 వికెట్లు తీసాడు. ఇందులో రెండు సార్లు ఐదు వికెట్ల ఘనతతో పాటు మూడుసార్లు నాలుగు వికెట్ల ఘనతను అందుకున్నాడు.
91 వన్డేల్లో 120 వికెట్లు తీసిన రియాజ్.. 2011 ప్రపంచకప్లో మొహాలీ వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో (5/46) ఐదు వికెట్లతో సత్తా చాటాడు. తన కెరీర్ పట్ల రియాజ్ సంతృప్తిని వ్యక్తం చేశాడు. ఫ్రాంచైజీ క్రికెట్లో సత్తా చాటాలని భావిస్తున్నట్లు చెప్పాడు.
'అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్కు ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. నా అంతర్జాతీయ కెరీర్ను ముగించాలనుకుంటున్నా. ఫ్రాంచైజీ క్రికెట్లో సత్తా చాటేందుకు ఉత్సాహంగా ఉన్నా. అత్యుత్తమ ప్రతిభావంతులతో కలిసి క్రికెట్ అభిమానులను అలరిస్తానని హామీ ఇస్తున్నాను.'అని తన ప్రకటనలో రియాజ్ పేర్కొన్నాడు.