
కరాచీ: పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ ఇర్ఫాన్ను నెటిజన్లు బతికుండగానే చంపేసారు. కారు ప్రమాదంలో ఇర్ఫాన్ మరణించాడని సోషల్ మీడియాలో ఓ ఫేక్ న్యూస్ను తెగవైరల్ చేశారు. దీంతో అతని శ్రేయోభిలాషులు, అభిమానులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు. ఈ క్రమంలో అతనికి ఎడతెరిపి లేకుండా ఫోన్ కాల్స్ వస్తుండటంతో తాను బతికే ఉన్నానని ఇర్ఫానే ట్విటర్ వేదికగా స్పష్టం చేశాడు. ఈ అసత్య వార్త తన కుటుంబ సభ్యులను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
'సోషల్ మీడియాలోని కొన్ని ఖాతాలు అర్థం పర్థం లేని ఫేక్ వార్తలను సృష్టిస్తున్నాయి. నేను కారు ప్రమాదంలో మరణించినట్లు అసత్య వార్తను ప్రచారం చేసాయి. ఇది నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఇక నాకు గ్యాప్ లేకుండా ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. దయచేసి అలాంటి వార్తలను నమ్మకండి. మాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. బాగానే ఉన్నాం'అని ఇర్ఫాన్ ట్వీట్ చేశాడు.
ఇక బధిర క్రికెటర్ అయిన ఇర్ఫాన్ తొలుత 2007లో పాక్ డెఫ్ క్రికెట్ టీమ్కు ప్రాతినిథ్యం వహించాడు. అనంతరం 2010లో పాక్ జాతీయ టీమ్ తరఫున ఇంగ్లండ్పై అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 4 టెస్ట్లు, 60 వన్డేలు, 22 టీ20లు ఆడిన ఇర్ఫాన్.. 10, 83, 16 వికెట్లు పడగొట్టాడు. ఏడు అడుగుల ఒక ఇంచు ఎత్తు కలిగిన ఇర్ఫాన్ టాలెస్ట్ క్రికెటర్గా గుర్తింపు పొందాడు. చివరిసారిగా పీఎస్ఎల్ ఆడిన ఇర్ఫాన్.. పాక్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని శ్రమిస్తున్నాడు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో అవకాశం వచ్చినా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.