అసలేం జరిగిందంటే..?
త్వరలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న పాకిస్థాన్.. రావల్పిండి వేదికగా సన్నాహకాలు మొదలుపెట్టింది. జట్టులోని ఆటగాళ్లంతా రెండుగా విడిపోయి ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడారు. అయితే ఈ మ్యాచ్ లో హసన్ అలీ.. ప్రత్యర్థి బ్యాట్స్మన్ అగ సల్మాన్ వికెట్ల ముందు బోల్తా కొట్టించే ప్రయత్నం చేశాడు. బంతి బ్యాట్ తాకకుండా ప్యాడ్ తాకడంతో గట్టిగా అప్పీల్ చేశాడు. అయితే అంపైర్ ఈ అప్పీల్ను పెద్దగా పట్టించుకోలేదు. దాంతో అంపైర్పైకి సరదగా దౌర్జన్యానికి దిగిన హసన్ అలీ.. దగ్గరకు వెళ్లి అతని వేలు పైకెత్తే ప్రయత్నం చేశాడు.
నవ్వులే నవ్వులు..
ఈ సరదా ఘటనతో అంపైర్తో పాటు మైదానంలో ఉన్న ఆటగాళ్లు నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇలా కూడా బ్యాటర్లను ఔట్ చేయొచ్చా? అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బౌలర్లు కష్టపడటం కంటే ఈ పద్ధతేదో బాగుందని మరికొందరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇక టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఆ జట్టు స్టార్ ప్లేయర్ మాథ్యూ వేడ్ ఇచ్చిన సునాయస క్యాచ్ను హసన్ అలీ నేలపాలు చేశాడు. ఈ తప్పిదం మ్యాచ్ ఫలితాన్ని శాసించింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న మాథ్యవేడ్ పరుగుల విధ్వంసం సృష్టించి విజయాన్నందించాడు. దాంతో అప్పట్లో హసన్ అలీని పాక్ అభిమానులు విలన్లా చూశారు.
లంక పర్యటనకు పాక్..
జూలై 16 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ కోసం పాకిస్థాన్ జట్టు త్వరలోనే ఆ దేశంలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా లంకతో పాక్.. రెండు టెస్టులు ఆడనుంది. జూలై 16-20 మధ్య తొలి టెస్టు, జూలై 24-28 వరకు రెండో టెస్టు జరుగనుంది. తొలి టెస్టును గాలేలో నిర్వహిస్తుండగా రెండో టెస్టు కొలంబోలో నిర్వహించనున్నాయి.. ఈ సిరీస్ కోసం పాకిస్థాన్ ఇప్పటికే 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
లంక పర్యటనకు ఎంపికైన పాకిస్థాన్ జట్టు:
బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, అబ్దుల్లా షఫిక్, అజర్ అలీ, ఫహీమ్ అష్రఫ్, ఫావద్ ఆలం, హరిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ నవాజ్, నసీం షా, నౌమన్ అలీ, సల్మాన్ అలి అగ, సర్ఫరాజ్ అహ్మద్, సౌద్ షకీల్, షాహీన్ అఫ్రిది, షాన్ మసూద్, యాసిర్ షా