ఎండ దెబ్బతో పాకిస్థాన్ సంతతికి చెందిన జునైల్ జఫార్ ఖాన్ అనే క్లబ్ లెవెల్ క్రికెటర్ మృతి చెందాడు. ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ 40 ఏళ్ల జునైల్ జఫార్ ఖాన్.. గత శనివారం అడిలైడ్లోని కాంకోర్డియా కాలేజీ వేదికగా ప్రిన్స్ ఆల్ఫ్రెడ్ ఓల్డ్ కాలేజియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓల్డ్ కాంకోర్డియన్స్ క్రికెట్ క్లబ్ తరఫున బరిలోకి దిగాడు.
తీవ్ర ఎండలో 40 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసిన అతను బ్యాటింగ్ చేస్తూ 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఒక్కసారిగా కుప్పకూలాడు. అతన్ని హుటాహుటినా ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. 40 డిగ్రీల సెల్సియస్ వేడిలో ఈ మ్యాచ్ జరగ్గా.. సాయంత్ర 4 గంటల సమయంలో జునైల్ జఫార్ ఖాన్ కుప్పకూలినట్లు ఆసీస్ మీడియా పేర్కొంది.

సౌత్ ఆస్ట్రేలియాలో గత కొద్దీ రోజులుగా తీవ్ర ఎండలు ఉన్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. అడిలైడ్ టర్ఫ్ క్రికెట్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం.. ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్ ధాటితే మ్యాచ్లను రద్దు చేస్తారు.
'ఓల్డ్ కాన్కార్డియన్స్ క్రికెట్ క్లబ్ సభ్యుని మరణం మాకు చాలా బాధను కలిగించింది. కాన్కార్డియా కాలేజ్ ఓవల్లో ఆడుతున్నప్పుడు అతను ఒక్కసారిగా కుప్పకూలాడు. అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా.. వైద్యులు ఎంత ప్రయత్నించినా అతని ప్రాణాలు దక్కలేదు.
ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నాం.'అని ఖాన్ క్లబ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఐటీ ఉద్యోగం చేయడానికి జునైల్ జఫార్ ఖాన్ 2013లో పాకిస్థాన్ నుంచి అడిలైడ్కు వచ్చినట్లు తెలుస్తోంది.