ఆసియా కప్ 2025 ట్రోఫీ వివాదంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ దిగొచ్చినట్లు తెలుస్తోంది. ట్రోఫీని తనతో తీసుకెళ్లినందుకు బీసీసీఐకి క్షమాపణలు కూడా తెలియజేశాడంట. అయితే ట్రోఫీ తిరిగిచ్చే విషయంలో మాత్రం నఖ్వీ మొండిగా వాదిస్తున్నట్లు తెలుస్తోంది. తన చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించాలని, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. ఏసీసీ ఆఫీస్కు వచ్చి తీసుకెళ్లాలని నఖ్వీ కండిషన్ పెట్టినట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొంది.
ఆసియాకప్ 2025 టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయానంతరం నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు భారత్ నిరాకరించింది. దాంతో హైడ్రామా చోటు చేసుకుంది. దాదాపు గంటన్నర తర్వాత ట్రోఫీ ప్రెజెంటేషన్ కార్యక్రమం జరిగింది. కానీ నఖ్వీ చేతుల మీదుగా అందుకోమని టీమిండియా స్పష్టం చేయడంతో టైటిల్ ప్రధానం చేయకుండా ప్రెజెంటేషన్ కార్యక్రమం ముగిసింది. ఇక నఖ్వీ ట్రోఫీతో పాటు విన్నింగ్ మెడల్స్ను తన వెంట తీసుకెళ్లగా.. టైటిల్ చేతిలో ఉన్నట్లు ఊహించుకొని టీమిండియా సంబరాలు చేసుకుంది.

అయితే ట్రోఫీని నఖ్వీ తీసుకెళ్లడంపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఏసీసీ సమావేశంలో తమ నిరసనను తెలియజేయడంతో పాటు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఏసీసీ సమావేశంలో నఖ్వీ తీరుపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. టైటిల్ తీసుకెళ్లడానికి నీకేం హక్కు ఉందని నిలదీసాడు. అయితే ఈ మీటింగ్ ఎజెండా ఇది కాదంటూ నఖ్వీ సమాధానం దాటవేసే ప్రయత్నం చేశాడు. టీమిండియాకు ట్రోఫీ కావాలంటే తన ఆఫీస్కు వచ్చి తీసుకోవాలని నఖ్వీ చెప్పినట్లు తెలుస్తోంది.
మరోవైపు నఖ్వీ తీరుపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అసహనం వ్యక్తం చేశాడు. తమ డ్రెస్సింగ్ రూమ్లోని సహచర ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్, వారి నమ్మకమే అతి పెద్ద ట్రోఫీ అని పేర్కొన్నాడు. గెలిచిన జట్టు ట్రోఫీ అందుకోకపోవడం ఇదే తొలిసారి అని చెప్పాడు.