ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్పై నెలకొన్న సందిగ్దతకు తెరపడింది. భారత్తో మ్యాచ్ను బహిష్కరించాలన్న తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఐసీసీతో చర్చల ద్వారా వచ్చిన ఫలితంతో సంతృప్తి చెందడంతో పాటు మిత్ర దేశాల విజ్ఞప్తి చేయడంతో భారత్తో మ్యాచ్ ఆడేందుకు తమ జట్టుకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది.
షెడ్యూల్ ప్రకారం ఆదివారం(ఫిబ్రవరి 15) కొలంబో వేదికగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. 'బహుపాక్షిక చర్చల ద్వారా వచ్చిన ఫలితం, మిత్రదేశాల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని ఫిబ్రవరి 15న భారత్తో టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్ ఆడాలని పాకిస్థాన్ జాతీయ జట్టును పాకిస్థాన్ ప్రభుత్వం ఆదేశిస్తోంది.'అని పాక్ ప్రభుత్వం అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

బంగ్లాదేశ్కు సంఘీభావంగా భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తున్నామని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ), ఐసీసీ మధ్య చర్చలు జరిగాయి. లాహోర్లో ఆదివారం పీసీబీ ఛైర్మన్ మోహిసిన్ నఖ్వీతో ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖవాజా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ అమీనుల్ ఇస్లాం సమావేశమయ్యారు.
పాకిస్థాన్ విధించిన షరుతుల్లో కొన్నింటికి ఐసీసీ ఆమోదం తెలపగా.. మరికొన్నింటిని తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. టోర్నీ నుంచి బహిష్కరించిన బంగ్లాదేశ్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, వారికి పార్టిసిపేషన్ ఫీజును చెల్లించాలని, ఐసీసీ రెవెన్యూలో పీసీబీ వాటను పెంచాలని, బంగ్లాదేశ్ వేదికగా మెగా టోర్నీ నిర్వహించాలనే విజ్ఞప్తులకు ఐసీసీ సానుకూలంగా స్పందించిందని సమాచారం.
అయితే భారత్, పాక్ ద్వైపాక్షిక సిరీస్, భారత్, బంగ్లాదేశ్, పాక్ ముక్కోణపు సిరీస్, బంగ్లాదేశ్ పర్యటనకు భారత్ వెళ్లేలా బీసీసీఐని ఒప్పించాలని చేసిన డిమాండ్లను ఐసీసీ తోసిపుచ్చింది. పాకిస్థాన్తో ద్వైపాక్షిక సిరీస్ ఆడాలని బీసీసీఐని ఆదేశించే అధికారం తమకు లేదని, ఈ అంశం తమ పరిధిలో లేదని పీసీబీకి ఐసీసీ తేల్చి చెప్పింది. బీసీసీఐకి మాత్రమే ఈ అధికారం ఉందని, భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బీసీసీఐ నడుచుకుంటుందని పీసీబీకి ఐసీసీ స్పష్టం చేసింది.
భారత్తో మ్యాచ్ బహిష్కరణపై పునరాలోచన చేయాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, శ్రీలంక క్రికెట్ బోర్డుతో పాటు ఇతర దేశాలు కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)ని రిక్వెస్ట్ చేశాయి. ఈ క్రమంలోనే పీసీబీ తమ నిర్ణయంపై యూటర్న్ తీసుకుంది. ఐసీసీ భారీ ఆంక్షలు విధిస్తుందనే భయం కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డును వెంటాడింది.