ఆసియా కప్ 2025 టోర్నీలో మరో భారత్- పాకిస్థాన్ మ్యాచ్కు రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న సూపర్-4 మ్యాచ్లో దాయాదీ దేశాలు అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్ దశలో భాగంగా గత ఆదివారం జరిగిన మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది.
అయితే ఈ మ్యాచ్ అనంతరం చోటు చేసుకున్న షేక్ హ్యాండ్ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇరు దేశాల వైరం మరింత హీటెక్కింది. ఈ క్రమంలోనే భారత్పై విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్థాన్ జట్టు భావిస్తోంది. ఇందు కోసం పాకిస్థాన్ జట్టు ప్రత్యేక ప్రణాళికలను రచిస్తోంది. భారత్తో మ్యాచ్లో ఉండే ఒత్తిడిని అధిగమించేందుకు, గత మ్యాచ్లో ఎదురైన ఓటమి నుంచి తేరుకునేందుకు పాకిస్థాన్ మేనేజ్మెంట్ చర్యలు చేపట్టింది. తమ ఆటగాళ్లను మానసికంగా మరింత ధృడంగా మార్చేందుకు ప్రముఖ సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ రహీల్ను ఆశ్రయించింది.

శనివారం పాక్ ఆటగాళ్లకు డాక్టర్ రహీల్ కౌన్సిలింగ్ తీసుకోవడంతో పాటు మోటీవేషనల్ సెషన్ నిర్వహించినట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొంది. ఈ ఇంటరాక్షన్లో భారత్తో మ్యాచ్లో ఒత్తిడి అధిగమించడం ఎలా? యాంగ్జైట్ను ఎలా తగ్గించుకోవాలనే విషయాలపై పాక్ ఆటగాళ్లకు పలు సూచనలు చేసినట్లు సమాచారం.
లీగ్ దశలో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్.. భారత బౌలర్ల ధాటికి 127 పరుగులకే పరిమితమైంది. ఓ దశలో 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ షాహిన్ షా అఫ్రిది భారీ సిక్సర్లతో గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అనంతరం భారత్ 25 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించి ఘన విజయాన్నందుకుంది. ఈ క్రమంలోనే విజయమే లక్ష్యంగా పాకిస్థాన్ సన్నదమవుతుంటే.. భారత్ మాత్రం తమకు మరో మ్యాచ్ మాత్రమేనని లైట్ తీసుకుంది.