హర్భజన్తో కయ్యం..
టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ను ఉద్దేశించిన షోయబ్ అక్తర్ చేసిన ట్వీట్పై అతను తనదైన శైలిలో స్పందించాడు. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరి మధ్య అటు మైదానంలో, ఇటు సోషల్ మీడియా వేదికగా మాటల తూటాలు పేలుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అక్తర్ చేసిన ఓ సరదా ట్వీట్కు భజ్జీ దీటుగా బదులిచ్చాడు. టీ20 ప్రపంచకప్లో భాగంగా వచ్చే ఆదివారం భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ విశ్లేషణ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇరు జట్లలోని పలువురు దిగ్గజ క్రికెటర్లు దుబాయ్కు చేరుకున్నారు.
ఆఫ్ట్రాల్ 200 వికెట్లుగాడివి...
ఈ నేపథ్యంలో హర్భజన్, అక్తర్ ఇండియా టుడే నిర్వహించిన సలామ్ క్రికెట్ చర్చా వేదికలో పాల్గొన్నారు. ఆ ఫొటోను పాక్ మాజీ పేసర్ ట్విటర్ వేదికగా పంచుకొని.. 'అన్నీ తెలుసనుకునే మిస్టర్ హర్భజన్ సింగ్తో భారత్-పాక్ మ్యాచ్కు ముందు దుబాయ్లో చర్చా కార్యక్రమంలో పాల్గొన్నాను' అంటూ అక్తర్ పోస్టు చేశాడు. దీనికి స్పందించిన హర్భజన్ చురక అంటించాడు. 'టెస్టుల్లో 200 వికెట్ల కన్నా తక్కువ ఉన్న ఆటగాడి కంటే.. 400కి పైగా వికెట్లున్న ఆటగాడికే క్రికెట్ గురించి ఎక్కువ తెలుసు' అని దీటుగా స్పందించాడు. టెస్టుల్లో అక్తర్ 178 వికెట్లు తీయగా.. హర్భజన్ 417 వికెట్లు తీసిన విషయం తెలిసిందే.

ముందే చెప్పా..
ఇక ఐపీఎల్ 2021 సీజన్ సందర్భంగా అధికారిక బ్రాడ్ కాస్టర్తో మాట్లాడిన హర్భజన్ సింగ్.. టీ20 ప్రపంచకప్లో భారత్ చేతిలో పాకిస్థాన్కు ఓటమి తప్పదన్నాడు. ఈ విషయాన్ని అక్తర్కు సైతం చెప్పానన్నాడు. 'షోయబ్ అక్తర్కు ఒకటే మాట చెప్పాను... మీరు మాకు మార్గం సుగమం చేస్తారు... మీరు ఆడతారు... కానీ ఓడిపోతారు... మీకు నిరాశ తప్పదు. మా జట్టు ఎంతో పటిష్టంగా ఉంది. మా వాళ్లు మిమ్మల్ని కచ్చితంగా ఓడిస్తారని అక్తర్కు చెప్పాను'అని భజ్జీ పేర్కొన్నాడు.

భారత్దే ఆధిపత్యం..
అయితే, ప్రపంచకప్ల చరిత్రలో పాకిస్థాన్పై భారత్కు సంపూర్ణ ఆధిక్యం ఉంది. దీంతో ఈ మ్యాచ్లోనూ టీమిండియానే గెలుస్తుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. 7 వన్డేలు, 5 టీ20 మ్యాచ్లలో భారత జట్టు పాక్పై జయభేరి మోగించింది. ఇక చివరిసారిగా 2019 ప్రపంచకప్ సందర్భంగా గ్రూప్ స్టేజ్లో భారత్తో తలపడ్డ పాకిస్తాన్... 89 పరుగుల తేడాతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications
