ఇంగ్లండ్ బీ టీమ్ చేతిలో ఓడటానికి సిగ్గుండాలి! చీము నెత్తురుంటే వెంటనే తప్పుకోవాలి.. కోచ్లపై ఫ్యాన్స్ ఫైర్!

న్యూఢిల్లీ: ఇంగ్లండ్ బీ టీమ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోవడాన్ని పాకిస్థాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మూడు వన్డేల సిరీస్లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోవడాన్ని సహించలేకపోతున్నారు. ఈ దారుణ ఓటమికి పాకిస్థాన్ హెడ్ కోచ్ మిస్బా ఉల్ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్లు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. చీము నెత్తురు, రోషం ఏ మాత్రం ఉన్నా కోచింగ్ బాధ్యతల నుంచి వెంటనే తప్పుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఘాటుగా విమర్శిస్తున్నారు.
మంగళవారం అర్ధరాత్రి జరిగిన మూడో వన్డేలో పాకిస్థాన్ భారీ స్కోర్ చేసినా విజయం సాధించలేకపోయింది. ఇంగ్లండ్ సమష్టి ప్రదర్శన ముందు తేలిపోయింది. ఫలితంగా మూడు వికెట్లతో మ్యాచ్ను గెలుచుకున్న బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్ టీమ్.. 3-0తో సిరీస్ను సైతం కైవసం చేసుకుంది.
హవ్వా.. అనామక జట్టుతో ఒక్క మ్యాచ్ గెలవరా?
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్ జట్టులో కరోనా కేసులు బయటపడ్డాయి. ముగ్గురు ఆటగాళ్లతో పాటు నలుగురు సహాయక సిబ్బందికి పాజిటీవ్ అని తేలింది. దాంతో అప్రమత్తమైన ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఆటగాళ్లందరిని ఐసోలేషన్కు తరలించింది. దాంతో పాకిస్థాన్తో సిరీస్లకు అప్పటికప్పుడు బెన్ స్టోక్స్ సారథ్యంలోని రెండో శ్రేణి ఆటగాళ్లతో మరో జట్టును ఎంపిక చేసింది.
స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టులో ఇద్దరు ముగ్గురు మినహా అంతా కొత్తవారు, అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం తక్కువ ఉన్నవాళ్లే. అయినా ఆ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. వరుసగా మూడు వన్డేల్లోనూ పాక్ను చిత్తు చేసింది. దాంతో ఒక్క మ్యాచ్లో కూడా పాక్ గెలవకపోవడం దారుణమని, హెడ్ కోచ్ మిస్బా ఉల్ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ల పనితీరు ఇలా ఉందని విమర్శిస్తున్నారు.
ఇద్దరూ ఐరెన్ లెగ్స్..
ఇక మిస్బా ఉల్ హక్, వకార్ యూనిస్లు కోచ్లుగా నియమితులైన తర్వాత పాకిస్థాన్ క్రికెట్ మరింత నాశనమైందని, అభిమానులు లెక్కలతో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఇద్దరు బాధ్యతలు చేపట్టిన తర్వాత పాక్.. శ్రీలంక బీ టీమ్ చేతిలో వైట్ వాష్ అయింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఒక్క విజయం సాధించలేదు.
ఇంగ్లండ్, న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్లు కోల్పోయింది. జింబాబ్వే చేతిలో వన్డే, టీ20 మ్యాచ్ల్లో ఓడింది. సౌతాఫ్రికా బీ టీమ్తో టీ20 మ్యాచ్లో పరాజయం పాలైంది. ఇప్పుడు ఇంగ్లండ్ బీ టీమ్ చేతిలో వైట్ వాష్ అయింది. దాంతో ఈ ఇద్దరు కోచ్లు ఐరెన్ లెగ్స్ అని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.
ఫన్నీ మీమ్స్, సెటైర్స్..
పాకిస్థాన్ ఓటమి నేపథ్యంలో కోచ్లపై అభిమానులు ఫన్నీ మీమ్స్తో పాటు సెటైర్లు పేల్చుతున్నారు. 'పాక్ దారుణ ఓటమిపై సుదీర్ఘంగా జరిపిన చర్చల తర్వాత జింబాబ్వే బీ టీమ్తో ఏడాది పాటు మ్యాచ్లు ఆడాలని పాకిస్థాన్ హెడ్ కోచ్ మిస్బా నిర్ణయించారు.'అని ఓ అభిమాని సెటైరికల్గా ట్వీట్ చేశాడు. హ్యారిస్, ఇమామ్, షాదాబ్, ఫషీమ్ జట్టుకు కుదిబండగా మారారని, అయినా వారికి కోచ్లు అండగా నిలుస్తున్నారని మండిపడ్డారు. ఈ దారుణ ఓటమిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పందించాలని, వెంటనే హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్లను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.

బాబర్ చెలరేగినా..
మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 331 రన్స్ చేసింది. బాబర్ ఆజామ్ (139 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 158) సెంచరీకి అండగా ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(56), మహ్మద్ రిజ్వాన్(74) రాణించారు. రిజ్వాన్తో కలిసి 179 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన బాబర్.. ఇమామ్తో 92 పరుగులు జోడించాడు.
ఇంగ్లండ్ బౌలర్లలో బ్రిడన్ కేర్స్ (5/61) ఐదు వికెట్లతో రాణించగా.. సకీబ్ మహమూద్(3/60) మూడు, మాట్ పర్కిన్సన్ ఓ వికెట్ తీశాడు. అనంతరం ఇంగ్లండ్ ఆడుతూ పాడుతూ 48 ఓవర్లలో 7 వికెట్లకు 332 పరుగులు చేసి 12 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. జేమ్స్ విన్స్(95 బంతుల్లో 11 ఫోర్లతో 102) సూపర్ సెంచరీతో రాణించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications