శ్రీలంక పర్యటనను పాకిస్థాన్ విజయంతో ప్రారంభించింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి ముందు సన్నాహకంగా ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్లో పాకిస్థాన్ శుభారంభం చేసింది. దంబుల్లా వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. షాదాబ్ ఖాన్(18 నాటౌట్, 2/25) ఆల్రౌండ్ ప్రదర్శనతో పాకిస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో పాకిస్థాన్ ఆధిపత్యం చెలాయించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19.2 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. జనిత్ లియానగే(40) టాప్ స్కోరర్గా నిలిచాడు.

అనంతరం పాకిస్థాన్ 16.4 ఓవర్లలో 4 వికెట్లకు 129 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. షాహిబ్జాదా ఫర్షాన్ (36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీతో రాణించాడు. మహీష్ తీక్షణ, దుష్మంత్ చమీరా, వానిందు హసరంగా, ధనంజయ డి సిల్వా తలో వికెట్ తీసారు. స్పిన్కు అనుకూలంగా ఉన్న ఈ వికెట్పై ఇరు జట్ల బ్యాటర్లు పరుగులు చేయలేకపోయారు. శ్రీలంక వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్లకు కూడా స్లో వికెట్లు ఉండే అవకాశం ఉంది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 శుక్రవారం జరగనుంది.
ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్.. నెదర్లాండ్స్తో తొలి మ్యాచ్ ఆడనుంది. అమెరికాతో ఫిబ్రవరి 10న రెండో మ్యాచ్, భారత్తో ఫిబ్రవరి 15న మూడో మ్యాచ్, నమీబియాతో ఫిబ్రవరి 18న నాలుగో మ్యాచ్లో పాకిస్థాన్ తలపడనుంది. ముందస్తు ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్ ప్రపంచకప్ మ్యాచ్లు శ్రీలంక వేదికగా జరగనున్నాయి.