
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2022లో తనదైన బ్యాటింగ్తో దుమ్మురేపుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్లో సూర్య(40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 68) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును దినేశ్ కార్తీక్తో కలిసి ఆదుకున్నాడు. ఆరో వికెట్కు 52 పరుగుల భాగస్వామ్యం అందించి పోరాడే లక్ష్యాన్ని అందించాడు. అయితే ఆ టార్గెట్ టీమిండియా ఓటమి గట్టెక్కించకున్నా.. అతని బ్యాటింగ్కు మాజీ క్రికెటర్లు ఫిదా అయ్యారు.
తన జీవితంలోనే ఇలాంటి ఇన్నింగ్స్ చూడలేదని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రశంసించగా.. సూర్య ఆడిన షాట్లు బాగున్నాయని పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ అన్నాడు.'సూర్య ఆడిన షాట్లు.. వికెట్ల వెనక్కి అతడు బంతిని మళ్లించిన తీరు.. అతడి టెక్నిక్ బాగుంది. అతడు షాట్లను చక్కగా ఆడాడు' అని షోయబ్ మాలిక్ కొనియాడాడు. 'సూర్య సమ్ థింగ్ డిఫరెంట్. అతడు ఆడిన షాట్లను చూసి యువ క్రికెటర్లు నేర్చుకోవాలి' అని వసీం అక్రమ్ వ్యాఖ్యానించగా... అతడి మాటలతో షోయబ్ మాలిక్ ఏకీభవించాడు. యువక్రికెటర్లు మరింత శ్రమించాలన్నాడు.
'సూర్య బ్యాట్తోనే కాదు.. బౌలర్ల మైండ్తోనూ ఆడతాడు. సూర్య షార్ట్ బాల్స్ ఆడితే.. బౌలర్ ఫుల్ లెంగ్త్ బాల్స్ వేస్తాడు... మిడిలార్డర్ బ్యాటర్ బౌలర్ల మైండ్తో ఆడటం చాలా ముఖ్యం'అని మాలిక్ వ్యాఖ్యానించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులే చేసింది. సూర్యకుమార్ యాదవ్(40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 68) మినహా అంతా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి(4/29) నాలుగు వికెట్లు తీయగా.. పార్నెల్(3/15) మూడు వికెట్లు పడగొట్టాడు. అన్రిచ్ నోర్జ్కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 137 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఎయిడెన్ మార్క్రమ్(41 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 52), డేవిడ్ మిల్లర్(46 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 59 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, అశ్విన్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసారు.