న్యూఢిల్లీ: పాకిస్థాన్ సీనియర్ ఆటగాళ్లు చాలా గలీజ్ గాళ్లని, ఒకరు విజయవంతమైతే తట్టుకోలేరని పాకిస్థాన్ బ్యాటర్ అహ్మద్ షెజాద్ తెలిపాడు.
ఇతరులు సక్సెస్ అయితే వారు సంతోషంగా ఉండలేరని చెప్పాడు. ఈ విషయం తాను ఇదివరకే చెప్పినా మళ్లీ చెబుతున్నానని తెలిపాడు. చాలా రోజులుగా జట్టులో చోటు కోల్పోయిన అతను తాజాగా క్రికెట్ పాకిస్థాన్తో మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయంపై స్పందించాడు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ విజయవంతమవ్వడానికి ధోనీనే కారణమని చెప్పాడు.
'విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించడానికి ధోనీనే కారణం. అతను అండగా ఉంటూ మద్దతివ్వడం వల్లే విరాట్ కోహ్లీ విజయవంతమయ్యాడు. కానీ, దురదృష్టం కొద్దీ పాకిస్థాన్లో అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ జట్టులోని సీనియర్లు, మాజీ ఆటగాళ్లు.. ఎవరైనా అద్భుతంగా ఆడితే తట్టుకోలేరు. వారు విజయవంతమైతే సహించలేరు. అలాగే విరాట్ కోహ్లీ రెండేళ్లుగా ఫామ్ అందుకోలేక తంటాలు పడుతున్నాడు.
అదే నా విషయంలో రెండు మ్యాచ్లు ఆడకపోయేసరికే పక్కనపెట్టారు. నన్ను దేశవాళీ క్రికెట్లో ఆడమన్నారు. అక్కడ నేను అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచినా పాకిస్థాన్ తరఫున ఆడటానికి మరో అవకాశం ఇవ్వలేదు' అని షెజాద్ చెప్పుకొచ్చాడు. వఖార్ యూనిస్ తన కెరీర్ను నాశనం చేశాడని అహ్మద్ షెజాద్ ఆరోపించాడు. ఈ విషయం పీసీబీ పెద్దలే తనకు తెలియజేశారని వాపోయాడు.