ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందే పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘాకు ఘోర అవమానం ఎదురైంది. ఈ టోర్నీ కోసం సన్నాహకంగా పాకిస్థాన్ జట్టు యూఏఈ వేదికగా అఫ్గానిస్థాన్, శ్రీలకంతో ముక్కోణపు టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం మూడు జట్లు ఇప్పటికే యూఏఈకి చేరుకున్నాయి. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో మూడు జట్ల కెప్టెన్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా తీవ్ర ఇబ్బందికి గురయ్యాడు. ఎక్కడికి వెళ్లినా తమను వదలరా? అంటూ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ముక్కోణపు సిరీస్ నేపథ్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్తో పాటు సల్మాన్ అఘా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్..'ఆసియాలో రెండో అత్యుత్తమ జట్టు అఫ్గానిస్థాన్ గత ప్రపంచకప్లో అద్భుతంగా ఆడింది. ఈసారి ఆసియా కప్ కోసం ఎలా సన్నద్ధమవుతున్నారు.'అని ప్రశ్నించాడు. దాంతో పక్కనే ఉన్న సల్మాన్ అగా షాక్కు గురయ్యాడు. ఎందుకంటే ఆసియాలోనే అఫ్గాన్ రెండో జట్టు అనడం అతన్ని ఇబ్బందికి గురి చేసింది. ఒకప్పుడు పాకిస్థాన్ జట్టుకు ప్రత్యేకమైన గౌరవం ఉండేది. కానీ, ఈ సారి బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్ లేకపోవడం, వరుస పరాజయాలతో చతికిల పడటంతో ఆ జట్టును ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆసియాలో అఫ్గాన్ రెండో జట్టు అయితే పాకిస్థాన్ మూడో జట్టా? అంటూ నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. పాపం పాక్ కెప్టెన్కు ఘోర అవమానం అంటూ కామెంట్ చేస్తున్నారు.

సెప్టెంబర్ 9న ఆసియా కప్ 2025కు తెరలేవనుండగా.. సెప్టెంబర్ 14న భారత్, పాకిస్థాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లు మెరుగైన ప్రదర్శన చేస్తే.. సూపర్-4తో పాటు ఫైనల్తో సహా మొత్తం మూడు సార్లు తలపడే ఛాన్స్ ఉంది. మరోవైపు భారత్-పాక్ మ్యాచ్ను బాయ్కాట్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. పహల్గాం ఉగ్రదాడిలో అమయాక భారత ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, అందుకు కారణమైన పాకిస్థాన్తో మ్యాచ్ ఆడటం ఏంటని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ మ్యాచ్ను చూడవద్దని, బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు.