ఆసియా కప్ 2025 టోర్నీలో పాకిస్థాన్ జట్టు మరోసారి ముఖం చాటేసింది. భారత్తో నెలకొన్న షేక్ హ్యాండ్ వివాదంపై పాకిస్థాన్ తమ నిరసనను కొనసాగిస్తోంది. లీగ్ దశలో భారత్ చేతిలో 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్ చిత్తయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లి డోర్ వేసుకున్నారు. ఈ ఘటనను తీవ్ర అవమానంగా భావించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ).. క్రీడాస్ఫూర్తికి విరుద్దంగా ప్రవర్తించిన భారత్పై చర్యలు తీసుకోవాలని ఐసీసీ ఫిర్యాదు చేసింది.
అంతేకాకుండా భారత జట్టు చర్యకు నిరసనగా ఆ రోజే పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ కార్యక్రమాన్ని బహిష్కరించింది. మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా బ్రాడ్కాస్టర్తో మాట్లాడలేదు. ఆ తర్వాత నిర్వహించిన మీడియా సమావేశానికి కూడా పాక్ నుంచి ఎవరూ హాజరు కాలేదు. అంతేకాకుండా టాస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్కు షేక్ హ్యాండ్ ఇవ్వద్దని తమ కెప్టెన్కు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ సూచించాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది.

ఐసీసీ మాత్రం మ్యాచ్ రిఫరీ తప్పులేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా యూఏఈతో తమ తదుపరి మ్యాచ్కు అతన్నే రిఫరీగా పెట్టింది. దాంతో ఆగ్రహానికి గురైన పాకిస్థాన్.. టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు బెదిరింపులకు దిగింది. మైదానానికి రాకుండా హోటల్కే పరిమితమైంది. కాసేపటి తర్వాత మైదానానికి రాగా.. గంట ఆలస్యంగా మ్యాచ్ జరిగింది. ఆండీ పైక్రాఫ్ట్ క్షమాపణలు చెప్పడంతోనే తాము టోర్నీలో కొనసాగుతున్నామని ఓ ప్రకటనను విడుదల చేసింది.
అయితే ఈ టోర్నీ సూపర్ -4లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్లు మరోసారి తలపడేందుకు సిద్దమయ్యాయి. ఆదివారం దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో శనివారం నిర్వహించిన ప్రీ మ్యాచ్ మీడియా కాన్ఫరెన్స్ను పాకిస్థాన్ జట్టు బహిష్కరించింది. ఆదివారం భారత్తో జరిగే మ్యాచ్కు కూడా ఆండీ ప్రైకాఫ్ట్నే ఐసీసీ రిఫరీగా నియమించింది. దాంతో పాకిస్థాన్ జట్టు తమ నిరసనను కొనసాగిస్తోంది.
శనివారం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న పాకిస్థాన్ జట్టు.. మీడియా సమావేశానికి మాత్రం దూరంగా ఉందని జాతీయ మీడియా పేర్కొంది. 'హ్యాండ్ షేక్ వివాదంతో పాటు అండీ పైక్రాఫ్ట్ను రిఫరీగా నియమించారనే కోపంతో పాకిస్థాన్ జట్టు మీడియా సమావేశాన్ని బహిష్కరించింది.'అని టోర్నీ ఆర్గనైజర్ ఒకరు మీడియాకు తెలిపారు.