ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్థాన్-యూఏఈ మ్యాచ్లో దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. ఫీల్డ్ అంపైర్ రుచిర పల్లియగురుగే తీవ్రంగా గాయపడ్డాడు. పాకిస్థాన్ వికెట్ కీపర్ మహమ్మద్ హ్యారీస్ విసిరిన త్రో అంపైర్ రుచిర చెవి భాగంలో బలంగా తాకింది. దాంతో అతను నొప్పితో విలవిలలాడాడు. వెంటనే ఫిజియోలు వచ్చి ప్రథమ చికిత్స అందించినా.. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అంపైర్ రుచిర మైదానం వీడాడు.
యూఏఈ ఇన్నింగ్స్ సందర్భంగా సైమ్ అయుబ్ వేసిన 6వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని యూఏఈ బ్యాటర్ ధ్రువ్ పరాషర్ వదిలేసాడు. బంతిని అందుకున్న కీపర్ మహమ్మద్ హ్యారీస్.. వెంటనే బౌలర్ సైమ్ అయుబ్ వైపు విసిరేసాడు. అప్పటికే సైమ్ అయుబ్ అంపైర్ వెనక్కి వెళ్లిపోయాడు. బంతి నేరుగా అంపైర్ రుచిర చెవికి బలంగా తాకింది. దాంతో మైదానం వీడేందుకు సిద్దమైన అంపైర్ రుచిరకు మహమ్మద్ హ్యారీ క్షమాపణలు చెప్పాడు.

ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా.. తన వల్లే గాయమైందని భావించి అంపైర్కు క్షమాపణలు చెప్పాడు. అంపైర్ రుచిర స్థానంలో గజి సోహెల్ అంపైర్గా బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
ఈ మ్యాచ్లో పాకిస్థాన్ 41 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసింది. ఫకార్ జమాన్(36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. షాహిన్ షా అఫ్రిది(14 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 29 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిక్(4/14) నాలుగు వికెట్లు తీయగా.. సిమ్రంజిత్ సింగ్(3/26) మూడు వికెట్లు పడగొట్టాడు. ధ్రువ్ పరషార్ ఒక వికెట్ తీసాడు.
అనంతరం యూఏఈ 17.4 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ చోప్రా(35 బంతుల్లో ఫోర్, సిక్స్తో 35), ధ్రువ్ పరాషర్(23 బంతుల్లో ఫోర్తో 20) టాప్ స్కోరర్గా నిలిచారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది(2/16), హ్యారీస్ రౌఫ్(2/19), అబ్రర్ అహ్మద్(2/13) రెండేసి వికెట్లు తీయగా.. సైమ్ అయుబ్, సల్మాన్ అఘా చెరో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో గ్రూప్-ఏ నుంచి రెండో జట్టుగా పాకిస్థాన్ సూపర్-4కు అర్హత సాధించింది. దాంతో సూపర్-4లో భారత్తో మరోసారి పాకిస్థాన్ తలపడనుంది. ఆదివారం దుబాయ్ వేదికగా ఈ హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.