
దుబాయ్: ఆసియాకప్ 2022 టోర్నీలో శ్రీలంకకు లక్ కొనసాగుతోంది. పాకిస్థాన్తో జరుగుతున్న ప్రీ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మైదానంలో చేజింగ్ చేసే టీమ్కు భారీ అడ్వాంటేజ్ ఉంటున్న నేపథ్యంలో లంక కెప్టెన్ డసన్ షనక ఏ మాత్రం ఆలోచించకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టాస్ గెలవడం తమ అదృష్టమని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందో తెలియకున్నా.. ముందుగా బౌలింగ్ చేయడం తమకు కలిసొచ్చే విషయమన్నాడు.
కీలక ఫైనల్ ముందు పాకిస్థాన్తో మ్యాచ్ ఆడే అవకాశం రావడం గొప్ప విషయమని, రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. అసలంక, ఫెర్నాండో దూరమవ్వగా.. ధనుంజయ జట్టులోకి వచ్చాడన్నాడు. ప్రమోద్ మదుషన్ అరంగేట్రం చేస్తున్నాడని చెప్పాడు.
మరోవైపు పాకిస్థాన్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. అఫ్గానిస్థాన్పై ఆఖరి ఓవర్లో రెండు సిక్స్లు బాది సంచలన విజయాన్ని అందించిన నసీమ్ షా ఈ మ్యాచ్కు దూరంగా ఉన్నాడు. షాదాబ్పై కూడా వేటు వేసిన పాక్ మేనేజ్మెంట్ ఉస్మాన్ ఖదీర్, హసన్ అలీలకు అవకాశం ఇచ్చింది. టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బౌలింగ్ చేసేవాళ్లమని పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు. ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న షాదాబ్ ఫైనల్కు సిద్దమవ్వాలనే రెస్ట్ ఇచ్చామని, నసీమ్ షాకు కూడా విశ్రాంతినిచ్చామని తెలిపాడు. డిఫెరెంట్ కాంబినేషన్ ప్రయత్నించే భాగంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు.
తుది జట్లు(అంచనా)
పాకిస్థాన్: మహమ్మద్ రిజ్వాన్(కీపర్), బాబర్ ఆజామ్(కెప్టెన్), ఫకార్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, కుష్దిల్ షా, అసిఫ్ అలీ, మహమ్మద్ నవాజ్, హసన్ అలీ, హరీస్ రౌఫ్, ఉస్మాన్ ఖదీర్, మహమ్మద్ హస్నైన్
శ్రీలంక: పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్(కీపర్), ధనంజయ డి సిల్వా, దనుష్క గుణతిలక, భానుక రాజపక్స, డసన్ షనక(కెప్టెన్), వానిందు హసరంగా, చమికా కరుణరత్నే, ప్రమోద్ మదుషాన్, మహీష్ తీక్షణ, దిల్షాన్ మదుషనక