
దుబాయ్: ఆసియాకప్ 2022 ప్రీ ఫైనల్ మ్యాచ్లో పాకిస్థాన్కు శ్రీలంక చుక్కలు చూపించింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ వానిందు హసరంగా (3/21) తీన్మార్ వేయడంతో పాకిస్థాన్ 121 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక ఇతర బౌలర్లలో మహీశ్ తీక్షణ(2/21), ప్రమోద్ మదుషన్(2/21) రెండేసి వికెట్లు తీయగా.. చమిక కరుణరత్నే, ధనుంజయ డిసిల్వా తలో వికెట్ తీసారు.
లంక బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. కెప్టెన్ బాబర్ ఆజామ్(29 బంతుల్లో 2 ఫోర్లతో 30), మహమ్మద్ నవాజ్(18 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 26) మినహా మరెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ముగ్గురు బ్యాటర్లు కనీసం ఖాతా కూడా తెరవలేదు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. లంక అరంగేట్ర పేసర్ ప్రమోద్.. పాక్ ఇన్ఫామ్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో ఆత్మ రక్షణలో పడిన పాక్ నిదానంగా ఆడింది. దాంతో ఆ జట్టు పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 49 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం స్పిన్నర్లు బరిలోకి దిగగా.. పాక్కు కష్టాలు మొదలయ్యాయి. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో ఫకార్ జమాన్(13)ను కరుణరత్నేను ఔట్ చేయగా.. మరుసటి ఓవర్లో హసరంగా బాబర్ ఆజామ్ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
తన వరుస ఓవర్లలో కుష్దిల్ షా(4), ఇఫ్తికర్ అహ్మద్(13), అసిల్ అలీ(0)లను హసరంగా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత తీక్షణ కూడా విజృంభించడంతో పాక్ కష్టాలు రెట్టింపు అయ్యాయి. హసన్ అలీ(0), ఉస్మాన్ ఖదీర్(3)లను ఔట్ చేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు మహమ్మద్ నవాజ్(26) వేగంగా పరుగులు చేసే ప్రయత్నం చేశాడు. అయితే అతను హసరంగా సూపర్ త్రోకు రనౌటయ్యాడు. హ్యారీ రౌఫ్ను ప్రమోద్ ఔట్ చేయడంతో పాక్ ఇన్నింగ్స్ మరో 5 బంతులు మిగిలుండగానే ముగిసింది.