
దుబాయ్: ఆసియాకప్ 2022లో శ్రీలంక జైత్ర యాత్ర కొనసాగుతోంది. సూపర్ 4 దశలో ఆ జట్టు వరుసగా మూడో విజయాన్నందుకుంది. పాకిస్థాన్తో శుక్రవారం జరిగిన ప్రీ ఫైనల్ మ్యాచ్లో సమష్టిగా రాణించిన శ్రీలంక 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన లంక.. అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్కు దూసుకెళ్లడమే కాకుండా టైటిల్కు అడుగు దూరంలో నిలిచింది. కీలక ఫైనల్ ముందు జరిగిన మ్యాచ్లో పాక్ చిత్తు చేసిన ఆ జట్టు.. ఫైనల్లో హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతుంది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. శ్రీలం బౌలర్లలో స్పిన్నర్ వానిందు హసరంగా (3/21) మూడు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. ఇతర బౌలర్లలో మహీశ్ తీక్షణ(2/21), ప్రమోద్ మదుషన్(2/21) రెండేసి వికెట్లు తీయగా.. చమిక కరుణరత్నే, ధనుంజయ డిసిల్వా తలో వికెట్ తీసారు. లంక బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. కెప్టెన్ బాబర్ ఆజామ్(29 బంతుల్లో 2 ఫోర్లతో 30), మహమ్మద్ నవాజ్(18 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 26) మినహా మరెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ముగ్గురు బ్యాటర్లు కనీసం ఖాతా కూడా తెరవలేదు.
122 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 17 ఓవర్లలోనే 5 వికెట్లకు 124 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్ పాతుమ్ నిస్సంక(48 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 55 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. కుశాల్ మెండిస్(0), గుణతిలక(0) విఫలమైనా.. భానుక రాజపక్స(24), డసన్ షనక(21) పర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో మమమ్మద్ హస్నైన్, హ్యారీస్ రౌఫ్ రెండేసి వికెట్లు తీయగా.. ఉస్మాన్ ఖదీర్ తలో వికెట్ తీసారు.