కొలంబో: ఆసియాకప్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్లో పాకిస్థాన్ టాపార్డర్ కుప్పకూలింది. లంక బౌలర్లు నిప్పులు చెరగడంతో 130 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓవైపు మతీష పతీరణ.. మరోవైపు వెల్లలాగే, మహీష్ తీక్షణ చెలరేగడంతో పాక్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు.
శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పూర్తిగా డిఫెన్స్కే పరిమితమైన పాకిస్థాన్.. పరుగులు చేసేందుకు తీవ్రంగా కష్టపడింది. ఇన్నింగ్స్ 5వ ఓవర్లో ఫకార్ జమాన్(4)ను ప్రమోద్ మధుషాన్ ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన బాబర్ ఆజామ్ మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్(52) సైతం ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈ ఇద్దరూ కాస్త ఎదురు దాడికి దిగడంతో పాకిస్థాన్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది.

అనంతరం స్పిన్నర్లు రంగంలోకి దిగగా.. పాకిస్థాన్ బ్యాటర్లు తడబడ్డారు. 64 పరుగులతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని స్పిన్ సెన్సేషన్ దునిత్ వెల్లలాగే విడదీసాడు. బాబర్ ఆజామ్ను స్టంపౌట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ కొద్ది సేపటికే హాఫ్ సెంచరీతో జోరు కనబర్చిన అబ్దుల్లా షఫీక్ను పతీరణ ఔట్ చేశాడు.
ఆ తర్వాత వచ్చిన మహమ్మద్ హ్యారీస్(3) కూడా పతీరణనే రిటర్న్ క్యాచ్గా పెవిలియన్ చేర్చగా.. మహమ్మద్ నవాజ్(12)ను తీక్షణ ఔట్ చేశాడు. ఆ వెంటనే వర్షం రావడంతో అంపైర్లు ఆటను ఆపేసారు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఆటను 45 ఓవర్లకు కుదించారు. మరోసారి అంతరాయం కలిగించడంతో ఓవర్లను ఇంకా కుదించే అవకాశం ఉంది.
ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే మెరుగైన రన్రేట్ ఉన్న శ్రీలంక ఫైనల్ చేరనుంది. వర్షం దోబుచులాడటంపై పాకిస్థాన్ అభిమానులతో పాటు భారత ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్లో భారత్-పాక్ మ్యాచ్ చూడాలనుకుంటున్నామని కామెంట్ చేస్తున్నారు.