కొలంబో: ఆసియాకప్ 2023లో శ్రీలంక సంచలన విజయాన్ని అందుకుంది. పాకిస్థాన్తో గురువారం జరిగిన డూ ఆర్డై మ్యాచ్లో శ్రీలంక 2 వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్కు దూసుకొచ్చింది. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్.. అభిమానులకు అసలు సిసలు మజా అందించింది. ఇరు జట్లు విజయం కోసం అద్భుతంగా పోరాడాయి.
షాహిన్ అఫ్రిది సంచలన బౌలింగ్తో పాక్ విజయం ఖాయమవ్వగా.. చరిత్ అసలంక సూపర్ బ్యాటింగ్తో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 42 ఓవర్లలో 7 వికెట్లకు 252 పరుగులు చేసింది. మహమ్మద్ రిజ్వాన్ (73 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 86 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఇఫ్తికర్ అహ్మద్(40 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
శ్రీలంక బౌలర్లలో మతీష పతీరణ(3/65) మూడు వికెట్లు తీయగా.. ప్రమోద్ మధుషాన్(2/58) రెండు వికెట్లు పడగొట్టాడు. మహీశ్ తీక్షణ, దునీత్ వెల్లలాగే(1/40)లకు తలో వికెట్ దక్కింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక నిర్ణీత 42 ఓవర్లలో 252 పరుగులే చేసి గెలుపొందింది.
కుశాల్ మెండీస్(87 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 91), సదీర సమరవిక్రమా(51 బంతుల్లో 4 ఫోర్లతో 48), చరిత్ అసలంక(47 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 49 నాటౌట్) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో ఇఫ్తికర్ అహ్మద్(3/50) మూడు వికెట్లు తీయగా.. షాహిన్ షా అఫ్రిది(2/52) రెండు వికెట్లు పడగొట్టాడు. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్-శ్రీలంక తలపడనున్నాయి.
సూపర్ రనౌట్..
253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ధాటిగా ఆడుతున్న ఓపెనర్ కుశాల్ పెరీరా అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. క్రీజులోకి వచ్చిన కుశాల్ మెండీస్.. పాతుమ్ నిస్సంకతో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో పవర్ ప్లేలో శ్రీలంక వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది.
చెలరేగిన కుశాల్ మెండీస్
అనంతరం శ్రీలంక కాస్త తడబడగా.. పాతుమ్ నిస్సంకను షాదాబ్ ఖాన్ రిటర్న్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 57 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన సదీర సమరవిక్రమాతో కలిసి కుశాల్ మెండీస్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. పాక్ బౌలర్లపై విరుచుకుపడిన కుశాల్ మెండీస్ 47 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అనంతరం మరింత ధాటిగా ఆడిన కుశాల్ మెండీస్.. స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. మరోవైపు సమరవిక్రమా కూడా వేగంగా పరుగులు చేశాడు. 100 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని ఇఫ్తికర్ అహ్మద్ విడదీసాడు. హాఫ్ సెంచరీకి చేరువైన సదీర సమరవిక్రమా(48)ను స్టంపౌట్ చేశాడు.
చరిత్ అసలంకతో కలిసి కుశాల్ పెరీరా తన జోరును కొనసాగించాడు. సెంచరీకి చేరువైన అతన్ని ఇఫ్తికర్ అహ్మద్ క్యాచ్ ఔట్ చేశాడు. 9 పరుగుల దూరంలో పెరీరా సెంచరీ చేజార్చుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ డసన్ షనక(2)ను కూడా ఇఫ్తికరే పెవిలియన్ చేర్చడంతోమ్యాచ్ ఉత్కంఠగా మారింది.
ఉత్కంఠ..
చివరి 18 బంతుల్లో శ్రీలంక విజయానికి 20 పరుగులు అవసరమవ్వగా.. జమాన్ ఖాన్ వేసిన 40వ ఓవర్లో చరిత్ అసలంక బౌండరీ బాది 8 పరుగులు రాబట్టాడు. షాహిన్ అఫ్రిది వేసిన 41వ ఓవర్లో ధనంజయ డిసిల్వా(5) క్యాచ్ ఔటవ్వగా.. ఆ మరుసటి బంతికే దునిత్ వెల్లలాగే(0) గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు.
చివరి ఓవర్లో లంక విజయానికి 8 పరుగులు అవసరమవ్వగా.. జమాన్ ఖాన్ కట్టుదిట్టంగా వేయడంతో మధుషాన్ (1) రనౌటయ్యాడు. అయితే ఐదో బంతికి చరిత్ అసలంక బౌండరీ బాదడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి బంతికి రెండు పరుగులు తీసిన చరిత్ అసలంక చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.