
కరాచీ: పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండు టెస్ట్ల సిరీస్ ఫలితం తేలకుండా ముగిసింది. శుక్రవారం ముగిసిన రెండో టెస్ట్లో పాకిస్థాన్ ఓటమి తప్పించుకుంది. ఆఖరి క్షణం వరకు ఇరు జట్లను ఊరించిన విజయం.. చివరకు ఊసురుమనిపించింది. 8 ఏళ్ల తర్వాత సెంచరీ నమోదు చేసిన పాకిస్థాన్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సర్ఫరాజ్ అహ్మద్.. పాకిస్థాన్కు ఓటమి తప్పించాడు. టెయిలెండర్ల సాయంతో ఆఖరి వరకు పోరాడిన సర్ఫరాజ్.. జట్టును విజయం దిశగా తీసుకెళ్లాడు. కానీ లక్ష్యానికి 22 పరుగుల దూరంలో 9వ వికెట్గా అతను పెవిలియన్ చేరడం పాకిస్థాన్ ఓటమి కొరల్లో చిక్కుకుంది. అయితే నసీమ్ షా(15 నాటౌట్), అబ్రర్ అహ్మద్(7 నాటౌట్)లు పోరాడగా.. బ్యాడ్ లైట్తో అంపైర్లు మరో మూడు ఓవర్ల ఆట మిగిలి ఉండగానే ఆటను నిలిపేసారు. దాంతో పాక్ ఓటమి తప్పించుకుంది.
319 పరుగుల లక్ష్యంలో భాగంగా 0/2 ఓవర్ నైట్స్కోర్తో చివరి రోజు ఆటను ప్రారంభించిన పాకిస్థాన్.. ఆట ముగిసే సమయానికి 9 వికెట్లకు 304 పరుగులు చేసి విజయానికి 15 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సర్ఫరాజ్ అహ్మద్(176 బంతుల్లో9 ఫోర్లు, సిక్స్తో 118) ఒక్కడే సెంచరీతో రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మైకేల్ బ్రేస్వెల్ నాలుగు వికెట్లు తీయగా.. ఇష్ సోది, టీమ్ సౌథీ రెండేసి వికెట్లు పడగొట్టారు. మ్యాట్ హెన్రీ ఓ వికెట్ తీసాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 449 పరుగులు చేసింది. పాకిస్థాన్ 408 పరుగులకే ఆలౌట్ అయింది. 41 పరుగుల తొలి ఆధిక్యం కలుపుకుని కివీస్ రెండో ఇన్నింగ్స్ లో 277 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఫలితంగా పాకిస్తాన్ ఎదుట 319 పరుగుల విజయలక్ష్యాన్ని నిలిపింది.