
కరాచీ: పాకిస్థాన్-న్యూజిండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్లో అరుదైన ఫీట్ నమోదైంది. 145 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని ఈ రికార్డును న్యూజిలాండ్ వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ సాధించాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తొలి రెండు వికెట్లను స్టంపౌట్ రూపంలో కోల్పోయింది. పాకిస్థాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫిఖ్ (7), వన్డౌన్ బ్యాటర్ షాన్ మసూద్ (3)ను కీపర్ టామ్ బ్లండెల్ స్టంపౌట్ చేసి పెవిలియన్కు చేర్చాడు.
ఇలా ఒకే మ్యాచ్లో మొదటి రెండు వికెట్లు స్టంపౌట్ కావడం పురుషుల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి. ఓవరాల్గా మాత్రం రెండోసారి కావడం గమనార్హం. ఇంతకుముందు 1976లో వెస్టిండీస్తో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా మహిళా జట్టు స్టంపౌట్ల రూపంలో వికెట్లను దక్కించుకొంది.
కివీస్పై తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ తొలి రోజే శతకం సాధించిన పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకొన్నాడు. పాక్ తరఫున దాదాపు 16 ఏళ్ల కిందట మహమ్మద్ యూసఫ్ నెలకొల్పిన రికార్డును తాజాగా బాబర్ అధిగమించాడు. ఒకే క్యాలెండర్ ఏడాదిలో (2006) అన్ని ఫార్మాట్లు యూసఫ్ 33 మ్యాచుల్లో 2,435 పరుగులు చేయగా.. దానిని బాబర్ బద్దలు కొట్టాడు.
ప్రస్తుతం 161(బ్యాటింగ్) పరుగులు చేసిన బాబర్ అజామ్ 2,584 పరుగులతో కొనసాతున్నాడు. అలాగే కేవలం టెస్టు ఫార్మాట్లోనే 2022 ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గానూ అవతరించాడు. ఇప్పటి వరకు జో రూట్ (15 మ్యాచుల్లో 1098) పేరిట ఉన్న రికార్డును బాబర్ తుడిచిపెట్టాడు. కేవలం 9 మ్యాచుల్లోనే 11 వందల పరుగుల మైలురాయిని దాటేశాడు.
ఈ మ్యాచ్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ 5 వికెట్లకు 90 ఓవర్లలో 317 పరుగులు చేసింది. సెంచరీ హీరో బాబర్ ఆజామ్(277 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్తో 161 బ్యాటింగ్), అగా సల్మాన్(3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్(86) హాఫ్ సెంచరీతో రాణించాడు. కివీస్ బౌలర్లలో ఆజాజ్ పటేల్, మైకేల్ బ్రేస్ వెల్ రెండేసి వికెట్లు తీయగా.. కెప్టెన్ టీమ్ సౌథీ ఓ వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్తో కివీస్ జట్టు పూర్తిస్థాయి కెప్టెన్గా టిమ్ సౌథీ బాధ్యతలు చేపట్టాడు.