హైదరాబాద్: వన్డే ప్రపంచకప్ 2023 నేపథ్యంలో న్యూజిలాండ్తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న వామప్ మ్యాచ్లో పాకిస్థాన్ బ్యాటర్లు సత్తా చాటారు. మహమ్మద్ రిజ్వాన్(94 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 103) సెంచరీ బాదగా.. బాబర్ ఆజామ్(84 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 80), సౌద్ షకీల్(53 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 75) హాఫ్ సెంచరీలతో రాణించారు.
దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 345 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ రెండు వికెట్లు తీయగా.. మ్యాట్ హెన్రీ, జేమ్స్ నీషమ్, లూకీ ఫెర్గూసన్ తలో వికెట్ తీసారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(1)ను మ్యాట్ హెన్రీ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన బాబర్ ఆజామ్.. మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(14) సాయంతో ఇన్నింగ్స్ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. దాంతో పాక్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 33 పరుగులే చేసింది.
ఆచితూచి ఆడుతున్న ఈ జోడీని మిచెల్ సాంట్నర్ విడదీసాడు. అబ్ధుల్లా షఫీక్ను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో పాక్ 46 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో బాబర్ ఆజామ్తో కలిసి మహమ్మద్ రిజ్వాన్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. తనదైన షాట్లతో చెలరేగిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తించింది.
ఈ క్రమంలో బాబర్ ఆజామ్ 59 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకోగా.. రిజ్వాన్ 53 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని మిచెల్ సాంట్నర్ విడదీసాడు. శతకానికి చేరువైన బాబర్ ఆజామ్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 114 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన సౌద్ షకీల్ సాయంతో మహమ్మద్ రిజ్వాన్ ఇన్నింగ్స్ను ముందుకు కొనసాగించాడు. తనదైన శైలిలో చెలరేగిన రిజ్వాన్.. 93 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. రిజ్వాన్ క్రీజును వీడినా.. అఘా సల్మాన్, సౌద్ షకీల్ ధాటిగా ఆడారు.
42 బంతుల్లో సౌద్ షకీల్ హాఫ్ సెంచరీ చేసుకోగా.. అతన్ని జేమ్స్ నీషమ్ పెవిలియన్ చేర్చాడు. షాదాబ్ ఖాన్(16), ఇఫ్తికర్ అహ్మద్(7 నాటౌట్) సాయంతో అఘా సల్మాన్ పాకిస్థాన్కు భారీ స్కోర్ అందించాడు.