
కరాచీ: టెస్ట్ ఫార్మాట్ అసలు సిసలు మజా ఏంటో చూపించామని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అన్నాడు. న్యూజిలాండ్తో రెండో టెస్ట్లో ఆఖరి సెషన్ గేమ్లో ఉన్న మజాను తెలియజేసిందన్నాడు. శుక్రవారం డ్రాగా ముగిసిన ఈ మ్యాచ్లో పాకిస్థాన్.. తృటిలో ఓటమిని తప్పించుకుంది. సర్ఫరాజ్ అహ్మద్ సెంచరీతో పాటు బ్యాడ్ లైట్ పుణ్యానా ఓటమితో పాటు మరో టెస్ట్ సిరీస్ కోల్పోయే ప్రమాదం నుంచి గట్టెక్కింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన సర్ఫరాజ్.. పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్లో మిడిలార్డర్లో ఒక్క భాగస్వామ్యం నమోదైనా విజయాన్ని అందుకునే వాళ్లమని చెప్పాడు. అఘా సల్మాన్ ఔటవ్వడంతో ప్రణాళిక మార్చుకోవాల్సి వచ్చిందని, ఆత్మరక్షణలో ఆడామని తెలిపాడు.
'చివరి రోజు ఫైనల్ సెషన్.. టెస్ట్ మ్యాచ్లోని అసలు సిసలు మజాను రుచి చూపించింది. టీ బ్రేక్ అనంతరం లక్ష్యాన్ని చేధించడమే మా ప్రణాళిక. సర్ఫరాజ్ అహ్మద్, సౌద్ షకీల్ ఆ దిశగానే ఇన్నింగ్స్ను ముందుకు నడిపించి విజయవకాశాలు సృష్టించారు. దాంతో మా విజయం ఖాయమని అంతా అనుకున్నాం. ఫైనల్ సెషన్ వరకు మా అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని భావించాం. మిడిలార్డర్లో ఒక్క భాగస్వామ్యం లభించినా ప్రత్యేకమైన ప్రణాళిక రచించేవాళ్లం. అయితే అఘా సల్మాన్ ఔటైన తర్వాత మా ప్రణాళికను మార్చాల్సి వచ్చింది.
సొంతగడ్డపై అభిమానుల అంచనాలకు తగ్గట్లు ఆడలేకపోయాం. కానీ కొన్ని సానుకూలంశాలు ఉన్నాయి. సానుకూలంశాలను మరింత సానబెట్టి ప్రతికూలమైన వాటిని తొలగించుకుంటాం. సర్ఫరాజ్కు ఇది డ్రీమ్ కమ్ బ్యాక్. గత నాలుగేళ్లుగా సైఫీ భాయ్ తనలోని ఫైర్ను సజీవంగా ఉంచుకున్నాడు. అవకాశం కోసం నిరీక్షించి సరైన సమయంలో ఆ ఫైర్ను బయటకు తీసాడు. అతని అసాధారణమైన ఇన్నింగ్స్తో ఈ మ్యాచ్లో విజయం సాధిస్తామని భావించాం.'అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.
319 పరుగుల లక్ష్యంలో భాగంగా 0/2 ఓవర్ నైట్స్కోర్తో చివరి రోజు ఆటను ప్రారంభించిన పాకిస్థాన్.. ఆట ముగిసే సమయానికి 9 వికెట్లకు 304 పరుగులు చేసి విజయానికి 15 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సర్ఫరాజ్ అహ్మద్(176 బంతుల్లో9 ఫోర్లు, సిక్స్తో 118) ఒక్కడే సెంచరీతో రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మైకేల్ బ్రేస్వెల్ నాలుగు వికెట్లు తీయగా.. ఇష్ సోది, టీమ్ సౌథీ రెండేసి వికెట్లు పడగొట్టారు. మ్యాట్ హెన్రీ ఓ వికెట్ తీసాడు.
8 ఏళ్ల తర్వాత సెంచరీ నమోదు చేసిన సర్ఫరాజ్ అహ్మద్.. పాకిస్థాన్కు ఓటమి తప్పించాడు. టెయిలెండర్ల సాయంతో ఆఖరి వరకు పోరాడిన సర్ఫరాజ్.. జట్టును విజయం దిశగా తీసుకెళ్లాడు. కానీ లక్ష్యానికి 22 పరుగుల దూరంలో 9వ వికెట్గా అతను పెవిలియన్ చేరడం పాకిస్థాన్ ఓటమి కొరల్లో చిక్కుకుంది. అయితే నసీమ్ షా(15 నాటౌట్), అబ్రర్ అహ్మద్(7 నాటౌట్)లు పోరాడగా.. బ్యాడ్ లైట్తో అంపైర్లు మరో మూడు ఓవర్ల ఆట మిగిలి ఉండగానే ఆటను నిలిపేసారు. దాంతో పాక్ ఓటమి తప్పించుకుంది.